Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ర‌స‌వ‌త్త‌రంగా కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నిక‌...టీడీపీ హ‌వా!

ర‌స‌వ‌త్త‌రంగా కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నిక‌...టీడీపీ హ‌వా!
విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (19:29 IST)
కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇది ప్రస్తుతం కొండపల్లి మునిసిపాలిటీ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ, టీడీపీకి స‌మానంగా సీట్లు రావ‌డంతో ఛైర్మ‌న్ ఎన్నిక ఉత్కంఠ‌గా త‌యారైంది. దీనితో రంగంలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు దిగారు. 
 
 
కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ రేస్ లో వైసిపి నుంచి ముగ్గురు, టిడిపి నుంచి ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన కొందరు వైసిపి, టిడిపి కౌన్సిలర్లు అదే రోజు సాయంత్రం నుంచి అజ్ఞాతంవాసంలోకి వెళ్ళారు. ఇరువైపులా వైసిపి, టిడిపి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. కొండపల్లి మునిసిపాలిటీ మొట్ట మొదటిగా ఏర్ప‌డిన నేప‌థ్యంలో,  చైర్మన్ ప‌ద‌విని తెలుగుదేశం పార్టీ కైవ‌శం చేసుకుంటుందా? లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా అనేది ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. 
 
 
కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో ఉన్న 29 వార్డులకు గాను తెలుగుదేశం పార్టీ 14 మంది కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14 మంది కౌన్సిలర్లు గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొండారు. అయితే 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కరిమికొండ శ్రీ లక్ష్మి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో స్వతంత్ర అభ్యర్థి శ్రీ లక్ష్మి చేర‌డంతో  తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 15కు చేరింది
 
తెలుగుదేశం పార్టీ కొండపల్లి మునిసిపాలిటీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. అయితే ఇక్కడే వైసిపి ఎక్స్ అఫీషియో ఓటు తెర మీదకు తెచ్చింది. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉండటంతో వైసిపి చైర్మన్ పదవి చేపట్టనున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సంఖ్యా బలం ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చైర్మన్ పదవి చేపట్టాలి. అంటే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేదు. కానీ, ఎక్స్ అఫీషియో ఓటు తెర మీదకు తెచ్చారు. మెజారిటీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కాబ‌ట్టి బోర్డు ఏర్పాటు చేయవచ్చ‌ని టీడీపీ నాయ‌కులు వాదిస్తున్నారు. అలా జరిగితే కొండపల్లి మునిసిపాలిటీ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. 

 
అదే జరిగితే వైసిపి కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచినా ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఉండాలంటే ఎక్స్ అఫీషియో ఓటు తెర మీదకు తెచ్చి సరికొత్త రాజకీయాల‌కు ఊపిరి పోశారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఎంపి కేశినేని నాని ఎక్స్ అఫీషియో ఓటు హక్కు క‌లెక్ట‌ర్ స‌మ‌క్షంలో ఇప్ప‌టికే  వినియోగించుకున్నారు. 

 
రాజ్యసభ, లోక్ సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు వీరిలో ఏ ఒక్కరైనా కార్పోరేషన్, పురపాలక సంఘం ఎన్నికల్లో రెండు పార్టీ వార్డు సంఖ్య సమానం అయినప్పుడు ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనితో తెలుగుదేశం పార్టీ సంఖ్యా బలం 16కు, వైసిపి సంఖ్యా బలం 15 చేరింది. ఇక ఆఖ‌రికి ఇపుడు తెలుగుదేశం పార్టీ కే చైర్మన్ పదవి దక్కే అవకాశాలున్నాయి. దీనిని అడ్డుకునేందుకు వైసీపీ పార్టీ నేతలు బేరసారాలు మొదలు పెట్టారు. ఇంకా కొద్ది రోజుల సమయం ఉండటంతో పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. 
 
 
వైసిపి చైర్మన్ రేస్ లో 23వ వార్డు కౌన్సిలర్ షేక్ రసూల్,19వ వార్డు కౌన్సిలర్ జోగి రాము,28వ వార్డు కౌన్సిలర్ బాడిస నాగ రాజకుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చైర్మన్ రేస్ లో 25వ వార్డు కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబు,29వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు,16వ వార్డు కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అభ్యర్థి మొట్టమొదటి చైర్మన్ అభ్యర్థి గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ నేతలకు త్వరలోనే అసలు సినిమా చూపిస్తాం...