Publish Date: Wed, 16 Jan 2019 (14:33 IST)
Updated Date: Wed, 16 Jan 2019 (14:34 IST)
ఓ యువతి తనకు పెళ్ళి సంబంధాలు కుదరడం లేదన్న బాధతో తన ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా స్తంభంపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి అనిత (27) అనే యువతి డిగ్రీ పూర్తి చేసింది. దీంతో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ఎన్నో సంబంధాలు చూసినా అవి కుదరలేదు.
ముఖ్యంగా, అనిత కొద్దిగా లావుగా ఉండటంతో ఆమెను చేసుకునేందుకు యువకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి... పురుగుల మందు సేవించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నమోదు చేస్తున్నారు.