Publish Date: Wed, 30 Oct 2024 (19:19 IST)
Updated Date: Wed, 30 Oct 2024 (19:24 IST)
కాకినాడ జిల్లాలో తల్లికి ఉరేసి.. ఆపై కుమార్తె కూడా ఉరేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కాకినాడ వన్టౌన్ సీఐ నాగదుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం… బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లికి చెందిన ఆకాశం సరస్వతి (60), ఆమె కుమార్తె స్వాతి (28) పన్నెండేళ్లుగా కాకినాడ పెంకెవారి వీధిలోని ఓ భవనం మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. సరస్వతి భర్త నర్సింహారావు పదహారేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు.
భర్త చనిపోవడంతో సరస్వతి తన పిల్లలను తీసుకొని జీవనోపాధి కోసం కాకినాడకు వచ్చేశారు. పెద్ద కుమార్తె బుజ్జికి వివాహం కాగా విశాఖపట్నంలో ఉంటున్నారు.
చిన్న కుమార్తె స్వాతి ఇంట్లోనే టైలరింగ్ చేస్తుండేది. సరస్వతి కొన్నాళ్లుగా అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో స్వాతి ఆందోళనకు గురయ్యారు. దీంతో లాభం లేదనుకున్న స్వాతి తల్లికి ఉరేసి.. ఆపై తాను కూడా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
తల్లి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండి పోయిన కుమార్తె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అందరూ షాకవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.