Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను మూసేస్తాం... కడప స్టీల్ ప్టాంట్‌కు అనుమతి : కేంద్రం

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను మూసేస్తాం... కడప స్టీల్ ప్టాంట్‌కు అనుమతి : కేంద్రం
, బుధవారం, 10 మార్చి 2021 (08:27 IST)
ఆంధ్రుల పోరాడి సంపాదించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మనుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఏపీ ప్రజలు ఆందోళనబాటపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే మూసేస్తామని కేంద్రం హెచ్చరించింది. అదేసమయంలో కడపలో ఉక్కు పరిశ్రమకు అనుమతులు మంజూరుచేసింది. ఇక్కడ మూసేసి.. అక్కడ తెరవడ వెనుక ఉన్న మతలబు ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. 
 
వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నామని కేంద్రం స్పష్టం చేయడం ఏపీలో కలకలం రేపుతోంది. అధికార, విపక్ష పార్టీలన్నీ దీనిపై మండిపడుతున్నాయి. మరోవైపు ఈ అంశంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం మరింత స్పష్టతను ఇచ్చారు. దేశంలోనే 5 ఉక్కు పరిశ్రమలను ఐదేళ్లలో ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. 
 
ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసేస్తామని స్పష్టం చేశారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటెజిక్ పరిధిలోకి వస్తుందని... ఈ విభాగంలోకి వచ్చే అన్ని పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.
 
మరోవైపు, కడపలో నిర్మించతలపెట్టిన ఉక్కు పరిశ్రమకు కేంద్ర పర్యావరణ అనుమతులు లభించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరులో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌ (స్టీల్ ప్లాంట్‌)ను నిర్మించనుండగా గతేడాది డిసెంబరు 20న పర్యావరణ అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మూడు నెలల వ్యవధిలోనే పర్యావరణ అనుమతులు లభించాయని, అత్యంత వేగంగా కేంద్రం నుంచి అనుమతులు సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
 
కాగా, ప్రభుత్వం నిర్మించతలపెట్టిన స్టీల్‌ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి మూడు మిలియన్ టన్నులు. అంతేకాదు, తొలి విడతలో 84.7 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కూడా చేయనున్నారు. ప్రైవేట్ డెవలపర్ అయిన లిబర్టీ స్టీల్ ఇండియాతో కలిసి ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను నిర్మించనుంది. కర్మాగారంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 484.4 హెక్టార్లలో 12,10,000 మొక్కలు నాటుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాను గెలిపిస్తే విశాఖను కూడా రక్షించుకోలేం... : సబ్బం హరి