Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సజ్జల రామకృష్ణా రెడ్డి నన్ను చంపాలని చూస్తున్నారు : జేసీ ప్రభాకర్ రెడ్డి

సజ్జల రామకృష్ణా రెడ్డి నన్ను చంపాలని చూస్తున్నారు : జేసీ ప్రభాకర్ రెడ్డి
, ఆదివారం, 27 డిశెంబరు 2020 (17:00 IST)
అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తనను చంపాలని చూస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇటీవల తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మారణాయుధాలతో వెళ్లి, దాడి చేయడం కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను చంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. 
 
'నేను ప్రజల మనిషి.. ప్రజల్లోనే ఉంటా. .చంపుతావా?. సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారు. పార్నపల్లి, పెండెకల్లు, అచ్యుతాపురంలో దాడులు చేసి దోచుకున్నారు. చంబల్‌ లోయల్లో ఉండాల్సినవాళ్లు తాడిపత్రిలో ఉన్నారు. సీసీ ఫుటేజీ తీసుకొని కేసు పెట్టమంటే... పోలీసులు ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు. నేను కేసు పెడితే పోలీసులు సస్పెండ్ అవుతారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు. రాష్ట్రంలో పోలీసులు మారాల్సిన అవసరముంది' అని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 
తొమ్మిది నెలల నుంచి గన్ లైసెన్స్ ఇవ్వకుండా వారు అడ్డుకుంటున్నారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తనతో మాట్లాడేందుకు వచ్చానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెబుతున్నారనీ.. అలా అయితే తన ఇంట్లో పని చేసే వికలాంగునిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నించారు. పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన సమయంలో తాను, తన కొడుకు అక్కడ లేమని వెల్లడించారు.
 
కాగా, గురువారం జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం, దీనిపై ఇరువర్గాల మధ్య సాగిన భీకర రాళ్ల దాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కొన్నిగంటలపాటు అట్టుడికిపోయిన విషయం తెల్సిందే. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేనిసమయంలో ఆయన ఇంట్లోకి  కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారు. ఇళ్లంతా కలియతిరుగుతూ వీరంగం సృష్టించారు. అక్కడున్న జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా.. అక్కడే కాసేపు జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్‌చల్‌ చేశారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డు అయింది.
 
ఇంత జరిగినప్పటికీ ముందు ప్రభాకర్ రెడ్డిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 307సెక్షన్ కింద తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై కూడా కేసు నమోదైంది. న్యాయవాది శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి డ్రైవర్ సుబ్బరాయుడును కులం పేరుతో దూషించడంతో పాటు బెదిరించారంటూ కేసు నమోదు చేశారు. 
 
కాగా, ఈ ఘటనపై తాడిపత్రి డీఎస్పీ చైతన్య స్పందించారు. జరిగిన ఘటనలపై జేసీ ప్రభాకర్ రెడ్డి, లాయర్ శ్రీనివాసులు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైనా, ఆయన కుమారుల పైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైవింగ్ లైసెన్సుల గడువు పొడగింపు