Publish Date: Thu, 04 Feb 2021 (11:43 IST)
Updated Date: Thu, 04 Feb 2021 (11:45 IST)
చిత్తూరు జిల్లాలో ఒక్క రోజు పర్యటన నిమిత్తం ఈ నెల 7న ఆదివారం గౌరవ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నారని, రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రపతి 7న బెంగళూరు విమానాశ్రయం నుండి వైమానిక దళ హెలికాప్టర్ లో మ. 12.10 గం.లకు మదనపల్లె లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ చేరుకుంటారు.
రోడ్డు మార్గాన ఆశ్రమం చేరుకుని మ.12.30 గం.ల నుండి సత్ సంగ్ ఆశ్రమం శంఖుస్థాపన, భారత్ యోగా విద్యా కేంద్ర “యోగా కేంద్రం” ప్రారంభం, సత్ సంఘ్ విద్యాలయంలో మొక్కలను నాటి, స్వస్ఠ్య ఆసుపత్రికి శంఖుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3.00 గంటలకు ఆశ్రమం నుండి మదనపల్లి హెలిపాడ్ చేరుకుని సదుం మండలం లోని పీపల్ గ్రూవ్ స్కూల్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ నకు మ.3.40 గంటలకు చేరుకుని స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి, ఆడిటోరియంలో ఉపాద్యాయులు మరియు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.
సాయంత్రం 4.50 గంటలకు అక్కడినుండి హెలికాప్టర్ లో బెంగళూరు తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలియజేశారు.
రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హెలికాప్టర్ లో చిప్పిలి హెలిపాడ్ 11.15 గంటలకు చేరుకుంటారు.
అక్కడినుండి ఆశ్రమం చేరుకుని గౌరవ భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారికి స్వాగతం పలికి, వారితో పాటు కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాల అనంతరం సాయంత్రం 5.00 గంటలకు సదుం హెలిపాడ్ నుండి బయలుదేరి తిరుపతి విమానాశ్రయం 5.30 గంటలకు చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఉదయం 11.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హెలికాప్టర్ లో చిప్పిలి హెలిపాడ్ 11.45 గంటలకు చేరుకుంటారు.
మదనపల్లి బి.టి.కళాశాలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారికి మ.12.10 గంటలకు స్వాగతం పలికి చిప్పిలి హెలిపాడ్ నుండి మ. 12.30 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని మ.1.05 గంటలకు గన్నవరం తిరుగుప్రయాణం కానున్నారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.