Publish Date: Mon, 01 Feb 2021 (12:36 IST)
Updated Date: Mon, 01 Feb 2021 (12:38 IST)
జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో షాక్ ఎదురైంది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం అన్న ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
ఎన్జీటీ తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిని జస్టిస్ రోయింగ్ టన్ నారీమన్, జస్టిస్ అనిరుధ్ బోస్ల బెంచ్ విచారణ జరిపింది.
పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకట రమణి వాదనలు వినిపించారు.
పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇస్తామని వివరించారు. విశాఖ నగరానికి తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందని, కొత్త ఆయకట్టు లేని ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని న్యాయవాది వ్యాఖ్యానించారు.
కాగా బాధిత రైతుల తరుఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టుకు 2006లో పర్యావరణ అనుమతులు రాగా, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పనులు 2016-17లో చేపట్టారని వివరించారు.