Publish Date: Thu, 07 Nov 2019 (19:02 IST)
Updated Date: Thu, 07 Nov 2019 (19:04 IST)
ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పై విరుచుకు పడ్డారు. శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో విమర్శలు కురిపించారు. "భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టిడిపి శవరాజకీయాలు చేస్తుందని జగన్ గారు అనడం.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టే ఉంది.
శవరాజకీయాలకు జగన్ గారు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం మర్చిపోయినట్టు ఉన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం ఇప్పటికైనా మానండి.
జగన్ గారికి చేతనైతే వైకాపా నేతల ఇసుక అక్రమరవాణా అడ్డుకొని, సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తేవాలి. మీ అసమర్థతవల్ల కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు. కాకినాడలో వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చేలోపే మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మాని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి" డిమాండ్ చేశారు.