Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాగుతున్న మూతలపర్వం : 150 సినిమా థియేటర్లు మూసివేత

సాగుతున్న మూతలపర్వం : 150 సినిమా థియేటర్లు మూసివేత
, ఆదివారం, 26 డిశెంబరు 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల మూతలపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 125కు పైగా థియేటర్లు స్వచ్చంధంగా మూసివేశారు. అలాగే, అధికారులు తనిఖీల్లో సౌకర్యాలు లేవన్న సాకుతో మరికొన్ని థియేటర్లను సీజ్ చేశారు. తాజాగా మరో 30 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీంతో ఏపీలో థియేటర్ల మూతలపర్వం కొనసాగుతోంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 985 వరకు థియేటర్లు ఉన్నాయి. వీటిలో 125 థియేటర్లు స్వచ్చంధంగా మూసివేశారు. మరో 30 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు 5 కిలోమీటర్ల దూరంలో దాదాపు 650కి పైగా సీటింగ్ కెపాసిటీ, అతిపెద్ద స్క్రీన్‌తో ఆసియాలోనే రెండో అతిపెద్ద థియేటర్‌గా ఉన్న వి-ఎపిక్‌ మల్టీప్లెక్స్‌ను కూడా మూసివేశారు. 
 
ఈ థియేటర్ ఉన్న ప్రాంతం సి గ్రేడ్ కింద అంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది. దీంతో ఈ థియేటర్‌లో కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.30 ధరలతో సినిమా టిక్కెట్లను విక్రయించాల్సివుంది. ఈ ధరలకు సినిమా థియేటర్ నిర్వహణ అసాధ్యమని భావించిన నిర్వాహకులు థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 
 
అలాగే అనేక జిల్లాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు థియేటర్లు నడపడం సాధ్యంకాదని భావించిన యజమానులు స్వచ్చంధంగా తమ థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. 
 
నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు చోట్ల థియేటర్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో అధికారులు 12 థియేటర్లను మూసివేయగా, 18 హాళ్లను యజమానులు స్వచ్చంధంగా మూసివేయించారు. అలాగే, గుంటూరులో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేసి 35 హాళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్