Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్య పెంపు: జగన్‌

వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్య పెంపు: జగన్‌
, మంగళవారం, 2 జూన్ 2020 (20:12 IST)
మౌలిక స‌దుపాయాల‌కు ఎక్క‌డా లోటు రాకుండా పేద‌ల‌కు ఇచ్చే ఇళ్ల నిర్మాణం అత్యంత పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌ని ఏపి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ మంగ‌ళ‌వారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వ‌హించారు.

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్ ‌సహా అధికారులు హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. పేదలకు మ‌రో తీపి కబురు చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం జ‌గ‌న్ ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్న సీఎం ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని సూచించారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.

డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూడాల‌న్నారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాల‌ని  సీఎం స్ప‌ష్టం చేశారు.

పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతోనే ఇంత‌టి భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామ‌న్నారు. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాల‌ని , పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాల‌న్నారు. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలి, గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలి అని సూచించారు.

పేదల కోసం చేస్తున్నఈ కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే పుణ్యం దక్కుతుంద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్న‌ట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా సీఎం సమీక్ష నిర్వ‌హించారు.

వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న పంపిణీ చేయనున్న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపైనా నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ‌సీఎం మాట్లాడుతూ భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, వారికి కేటాయించిన స్థలం వద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వారంటైన్ సెంటర్లలో మాస్కులు ఇవ్వలేదట.. కండోమ్‌లు, ఆ ట్యాబెట్లు ఇస్తున్నారట..