Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానం అమలు: మంత్రి పేర్ని నాని

webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (20:16 IST)
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. 

మంగళవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల  పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.

తొలుత స్థానిక వలందపాలెంకు చెందిన మాదివాడ బాపనరావు మంత్రి వద్ద తన సమస్య చెప్పుకొన్నారు. తనకు 73 సంవత్సరాల వయస్సు అని ఇటీవల తన వృద్ధాప్య పింఛన్ తొలగించారని , అదేమని సచివాలయ సిబ్బందిని అడిగితే , తన కుమారుడు రేషన్ కార్డులో ఉన్నాడని, ఆదాయపన్ను చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొడుకు రేషన్ కార్డులో ఉన్న కారణంగా తనకు అర్దాంతరంగా పింఛన్ నిలిచిపోయిందని ఆ వృద్ధుడు వాపోయాడు. 

ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, మీ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం రాగానే రేషన్ కార్డు నుంచి ఆయన పేరు తొలగిస్తే బాగుండేదని చెప్పారు. మీ కార్డులో ఆయన పేరు తొలగించకపోవడం వలన మీ పింఛన్ నిలిచి పోయిందన్నారు. 

రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని అంచనా ఉంటే అందులో దాదాపు 4.31 కోట్ల మంది రేషన్ కార్డు లో ఉన్నారని, ఆ రేషన్ కార్డులలో అర్హత లేని వారు కూడా ఉన్నట్లుగా అనుమానాలున్నాయిన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, బాగా ఆస్తులు ఉన్నవారు, పన్నులు చెల్లించే వారు, వివిధ వ్యాపారాలు చేసేవారు, సంపన్న వర్గాల వారు రేషన్ కార్డులో ఉన్నట్లుగా అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం  అనర్హుల ఏరివేత కార్యక్రమం ప్రారంభించందన్నారు.

రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం  ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని  ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో వార్షికాదాయంతో పాటు ఇతర నిబంధనల్లోనూ మార్పులు చేసిందని మంత్రి అన్నారు. గ్రామాల్లో వార్షికాదాయం రూ.1.20లక్షలు, పట్టణాల్లో వార్షికాదాయం రూ.144లక్షలు ఉన్న వారు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులని తెలిపారు. 

పాత రేషన్ కార్డుదారుల్లో  కారు ఉన్నా, ఆదాయపన్ను  కడుతున్నా, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పింఛన్ తీసుకుంటున్నా వారికి అనర్హులుగా గుర్తించి కార్డును తొలగించారన్నారు . ఇక ఇదే విధానాన్ని కొత్తగా మంజూరు చేయబోయే రేషన్ కార్డు దరఖాస్తుదారులకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయని మంత్రి అన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడి స్థానికాల‌యాల్లో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం