ఉత్తరాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒరిస్సా వరకూ మరట్వాడా నుంచి తెలంగాణ మీదగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయని, వీటి ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయని విశాఖపట్టణం వాతావరణం కేంద్రం తెలిపింది.
రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.