Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కోట్ల రూపాయల అక్రమ మైనింగ్

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కోట్ల రూపాయల అక్రమ మైనింగ్
, సోమవారం, 24 జనవరి 2022 (21:47 IST)
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీలపై అధికారులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలుగా మారిన మైనింగ్ అధికారులు అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్వారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన రెండు వారాలుగా క్వారీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.


పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన అధికారులు, సంబంధిత వాహనాలను అలాగే తరలింపుకు సిద్ధంగా ఉన్నా గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. తన నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ క్వారీకి పాల్పడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు.

 
ఈ నెల మొదటి వారంలో తన సొంత నియోజకవర్గం కుప్పంకు వచ్చిన చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు ఇక్కడే గడిపారు. చివరి రోజు అనూహ్యంగా ఆయన అక్రమ క్వారీలను సందర్శించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ క్వారీ జరుగుతున్న తీరును చూసి నివ్వెరపోయారు. 

 
ఎలాంటి అనుమతులు లేకుండా నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలలో పెద్ద ఎత్తున క్వారీలు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా స్థానిక నేతలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. క్వారీ జరుగుతున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన చంద్రబాబునాయుడు... స్థానిక వైసీపీ నేతలు అలాగే మంత్రి పెద్దిరెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఆశీస్సులతోనే కుప్పం వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాగా చంద్రబాబు ఆరోపణలు చేసిన 24 గంటల వ్యవధిలోనే మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. 

 
చంద్రబాబు నాయుడు పర్యటించిన శాంతిపురం మండలం లోని ముద్దున పల్లె, సి బండపల్లి గ్రామాలలోని క్వారీలను అధికారులు ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డితో సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో అక్రమ క్వారీ జరుగుతోందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన మైనింగ్ అధికారులు దూకుడు పెంచారు. పెద్ద ఎత్తున మైనింగ్ అధికారులు కుప్పంకు చేరుకొని, నాలుగు బృందాలుగా విడిపోయి పలు క్వారీలను సందర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనేకచోట్ల అక్రమ మైనింగ్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు. గడచిన పది రోజులుగా కుప్పం నియోజకవర్గం అంతటా మైనింగ్ అధికారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.

 
ఇప్పటివరకు మైనింగ్‌కు వినియోగించే నాలుగు ప్రొక్లెయినర్లు, 10 కంప్రెసర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న 200 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఈ దాడులు మరిన్ని రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు, కాగా అధికారుల తనిఖీలతో మైనింగ్ ముఠాలు ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల ASPపై చీటింగ్ కేసు- డమ్మీ డీఎస్పీని దించి రూ.1.2 కోట్లు మోసం..