Publish Date: Thu, 16 Apr 2026 (14:27 IST)
Updated Date: Thu, 16 Apr 2026 (14:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం వెల్లడైన విషయం తెల్సిందే. అయితే, ఈ ఫలితాల వెల్లడికి ముందు ఓ విద్యార్థితో వింత పని చేయించింది. ఆ వింత పనేంటో పరిశీలిస్తే, ఇంటర్ ఫలితాలు వెలువడక ముందే ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేసి తనను ఎలాగైన పాస్ చేయాలంటూ వేడుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... విశాఖకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఒకరు బుధవారం ఫలితాలకు ముందు బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు. పరీక్షల్లో ఏమీ చదవలేదని, జవాబు పత్రాల్లో ప్రశ్నాపత్రాన్నే మూడుసార్లు రాశానని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, పాస్ చేయాలనే ఉద్దేశంతో జవాబు పత్రాల్లో డబ్బులు కూడా పెట్టానని అధికారులకు చెప్పాడు.
అతని ఆందోళనను అర్థం చేసుకున్న అధికారులు వెంటనే స్పందించి ఫోనులోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. కంగారు పడాల్సి అవసరం లేదని, త్వరలో అడ్వాన్స్డ్ సిప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని వాటి కోసం బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం ఈ విషయాన్ని విశాఖపట్టణం ఆర్ఐఓ దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థి తల్లిదండ్రులకు ఇవ్వాలని కోరారు.
జిల్లా అధికారులు రంగంలోకి దిగి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. కాగా, వెలువడిన ఫలితాల్లో ఆ విద్యార్థి మొదటి సంవత్సరంలో రెండు, ద్వితీయ సంవత్సరంలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. విద్యార్థి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని, తాము జాగ్రత్తగా చూసుకుంటామని అతని తల్లిదండ్రులు అధికారులకు హామీ ఇచ్చారు.