ఇటీవలి కాలంలో చాలామంది విలాసవంతమైన జీవితాలకోసం చేస్తున్న ప్రయత్నాల్లో బలైపోతున్నారు. తమకు ఉన్నదాంట్లో ఎలాగో సర్దుకుందామనే ధోరణి విడనాడి అడ్డదారుల్లో డబ్బు ఆర్జించేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. అలాంటివారు కొన్నిసార్లు ఆన్ లైన్ బెట్టింగులు అంటూ దారుణంగా మోసపోతున్నారు. దీనితో అంతకుముందు వున్న జీవితం కంటే అధఃపాతాళానికి పడిపోతున్నారు. ఫలితంగా దొంగలుగా, మోసగాళ్లుగా మారిపోతున్నారు. ఇటువంటి ఘటనే దాచేపల్లిలో జరిగింది.
దాచేపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ అనే ఉద్యోగి పింఛన్ డబ్బులను తీసుకుని భార్యాపిలల్లతో సహా కనిపించకుండా పోయాడు. అతడు ఏమయ్యాడోనని వెతికేలోపుగానే అతడే ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసాడు. అందులో అతడు దీనంగా మాట్లాడుతూ.... ''సార్ కమిషనర్ గారూ, నేను ఆన్ లైన్ బెట్టింగులో డబ్బులు పోగొట్టుకున్నా. ఈ బెట్టింగులో ప్రభుత్వ సొమ్మును కూడా ఖర్చు చేసేసా. తప్పు తెలుసుకున్నా. నేను చేసిన తప్పు వల్ల నా భార్యాబిడ్డలను రోడ్డుపైన పడేసా. ఈ ఒక్కసారికి క్షమించండి.
ఒక్క నెలరోజుల్లో ప్రభుత్వ సొమ్మును ఎలాగైనా తిరిగి అప్పగించేస్తాను. సార్ కలెక్టర్ గారూ.. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నా పిల్లలు రెండు రోజులుగా అన్నం కూడా తినలేదు'' అంటూ గద్గద స్వరంతో దీనాతిదీనంగా వేడుకుంటున్నాడు. తమ పిల్లల్ని ఎత్తుకుని వెనుకవైపు నిల్చున అతడి భార్య ఎంతో బాధతో కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఇటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడద పాపం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.