Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం... నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్

cyclone
, ఆదివారం, 3 డిశెంబరు 2023 (08:41 IST)
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిపోయింది. ఇది నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుఫాను రాష్ట్రం దిశగా వస్తోందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
 
సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విద్యుత్, రవాణాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను శిబిరాల్లో ఆహారం, తాగునీరు, పాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
 
తుపాను నేపథ్యంలో 8 జిల్లాలకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
 
మరోవైపు, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో తుపానుగా మారనుంది. ఈ నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. 142కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. డిసెంబరు 3 నుంచి 6 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు. రైళ్ల రద్దు విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
 
తీవ్ర వాయుగుండం తుపానుగా మారితే మిచౌంగ్ (బలశాలి)గా పిలవనున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మినీ సార్వత్రిక సమరం : ఓట్ల లెక్కింపు ప్రారంభం - కాంగ్రెస్ ఆధిక్యం