Publish Date: Thu, 13 Aug 2020 (08:13 IST)
Updated Date: Thu, 13 Aug 2020 (08:15 IST)
కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఆ శాఖ అంచనా వేసింది.
రెండు రోజులు అక్కడే స్థిరంగా కొనసాగి, మరింత బలపడనుందని తెలిపింది. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, యానాంలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
తీర ప్రాంతంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3.5 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అలలతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. కాగా, కోస్తాంధ్రలో బుధవారం ముసురు వాతావరణం నెలకొంది. విశాఖ, ఉభయగోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.