Publish Date: Tue, 20 Oct 2020 (09:11 IST)
Updated Date: Tue, 20 Oct 2020 (09:12 IST)
ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావారణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. రానున్న 4- 5 గంటల్లో పలుచోట్ల భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ మేరకు విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యింది..