గుంటూరు నగరంలోని ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్లో ముగ్గురు వ్యక్తులు సోమవారం ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో సిబ్బంది బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలోని బొంగరాలబీడు- రెండవలైన్లో నెలపాటి నిర్మల అనే మహిళకు ఓ ఇల్లు ఉంది. దీనిని స్థానికుడైన అంబేద్కర్కు సంవత్సరం కింద లక్ష రూపాయలకు తాకట్టు పెట్టింది.
నెల క్రితం ఇంటిని విడిపించుకోవడానికి వెళితే అంబేద్కర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు అరండల్ పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా అక్కడ న్యాయం జరగక పోగా, పోలీసులు కూడా అంబేద్కర్కే సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సోమవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి నిర్మల, ఆమె కుమారుడు భానుప్రకాశ్, ఆమె అక్క కుమార్తె కుమారీలు వచ్చారు.
ఫిర్యాదు చేసిన అనంతరం తమకు న్యాయం చేయాలంటూ వెంట తెచ్చుకున్న ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డుకున్న సిబ్బంది వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.