Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలో హరితవిప్లవం రాయడం ఖాయం: ఆలపాటి రాజేంద్రప్రసాద్

రాష్ట్రంలో హరితవిప్లవం రాయడం ఖాయం: ఆలపాటి రాజేంద్రప్రసాద్
, ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:22 IST)
రాష్ట్రప్రభుత్వం రైతులనడ్డివిరిచేలా వ్యవహరిస్తోందని, జగన్ ప్రభుత్వ ఆలోచనాధోరణి, విధానాలు అలానేఉన్నాయని, నివర్ తుఫానుకారణంగా రైతులంతా తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో, వారిని ఆదుకోవడంలో ఏపీసర్కారు ఘోరంగా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండి పడ్డారు.

అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నష్టపోయిన పంటలవివరాలను   సక్రమంగా చేస్తున్నట్లు, తడిసిపోయిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పడం జరిగిందని, ఆయన చెప్పిన మాటలు ఇంతవరకుఎక్కడా ఆచరణలో వాస్తవరూపం దాల్చ లేదని టీడీపీనేత ఆరోపించారు.

వ్యవసాయశాఖ మంత్రి సొంతజిల్లా లోనే ఇప్పటివరకు పంటనష్టాన్ని లెక్కించలేకపోయారన్నారు. ఈ- క్రాప్ నమోదవ్వాలని, అడంగల్ లో రైతులపేర్లు నమోదై ఉండాలని, అప్పుడే  పంటనష్టం వివరాలను నమోదు చేస్తామని అధికారయంత్రాంగం చెబుతోందన్నారు. జగన్ ప్రభుత్వం కౌలురైతులకు కూడా మొండిచెయ్యే చూపిందన్నారు.

ఎన్నికలకు ముందు కౌలురైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక 15, 16 లక్షలవరకు ఉన్న కౌలురైతుల గుర్తింపుకార్డులను కూడా  రెన్యువల్ చేయించ లేకపోయాడన్నారు. పంట హక్కుదారుగా కౌలురైతులను ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందో చెప్పాలని ఆలపాటి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలుకేంద్రాలు ఏర్పాటుచేయలేదని, దాంతో రైతులు దళారులచేతిలో తీవ్రంగా దోపిడీకి గురవుతు న్నారన్నారు. ముఖ్యమంత్రికి, వ్యవసాయమంత్రికి సేద్యంపై అవగాహన లేదని, అందుకే రైతులంతా నిస్సహాయస్థితిలో ఉన్నార న్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల అరకొరగా రైతులనుంచి  30శాతం పంటలఉత్పత్తులను మాత్రమే కొనుగోలుచేస్తున్నప్రభుత్వం, తిరిగి వాటిని రెండునెలల్లోనే ఎక్కువధరకు అమ్మేస్తోందన్నారు.

పసుపు ధర రూ,6500లు ఉంటే, రూ.4వేలకే అమ్మేశారని, జొన్నలను రూ.2,500లకుకొన్న ప్రభుత్వం, రూ.1400లకు, మొక్కజొన్నలు రూ.1800లకు కొని, రూ.1350లకే అమ్మేయడం జరిగిందన్నారు.  ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తుంటే ధరలస్థిరీకరణ ఎక్కడుంటుందో చెప్పాలని రాజేంద్రప్రసాద్ నిలదీశారు.  నివర్ తుఫాను అనంతరం, ముఖ్యమంత్రిగానీ, వ్యవసాయమంత్రి గానీ ఒక్కరోజు కూడా పంటనష్టం వివరాలపై సమీక్ష చేసినపాపాన పోలేదన్నారు.

మాటల్లో రైతులకు రెట్టింపు ఆదాయం రావాలని చెబుతున్న ముఖ్యమంత్రి, రైతులకు ఇప్పటివవరకు ఎలాంటి రాయితీలు, యంత్రపరికరాలు అందచేసిన దాఖాలాలు లేవన్నారు. టార్పాలిన్లు, స్ప్రేయర్లు, హార్వెస్టర్లు, ఇతరయంత్రపరికరాలను ఎక్కడా రైతులకు అందించింది లేదన్నారు.  ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటుచేసిన 15వేలరైతుభరోసా కేంద్రాలు, అధికారపార్టీ కేంద్రాలుగానే ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.

రైతులు తొలిపంటను కోల్పోయి, రెండోపంటకు సిద్ధమవుతున్నారని, ఈ సమయంలో జిల్లాలవారీగా ఎటువంటిపంటలు రైతులతో వేయించాలి, వారికి ఎలాంటివిత్తనాలు అందించాలనే ఆలోచన ప్రభుత్వం ఇంతవరకు చేయలేదన్నారు. విత్తనాలు అందించాక, రైతులకు అవసరమైన ఎరువులు, వ్యవసాయ పరికరాలను అందించాలనే ఆలోచనకూడా చేయడంలేదన్నారు.

రైతుల పంటల బీమాసొమ్ము చెల్లించకుండానే, చెల్లించామంటూ అసెంబ్లీసాక్షిగా పాలకులు అబద్ధాలు చెప్పినప్పుడే, ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేలిపోయిందన్నారు. వ్యవసాయమంత్రికి వ్యవసాయంపై అవగాహనే లేదని, అదును, పదునుచూడటం, రైతులకు సకాలంలోఅవసరమైనవాటిని అందించాలనే ఆలోచన ఆయన ఏనాడూ చేసిందిలేదన్నారు.

ప్రభుత్వం రైతులగురించి ఆలోచిస్తుంటే, రాష్ట్రంలో రైతుఆత్మహత్యలు ఎందుకు జరుగు తున్నాయో సమాధానం చెప్పాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడిని విమర్శిం చడమే పనిగా పెట్టుకున్నారుతప్ప, రైతులఆవేదనను వారు పట్టించుకోవడంలేదన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాకమూడుసార్లు పంటనష్టం జరిగిందని, అన్నిసార్లలో ఒక్కసారికూడా రైతుకు జరినగినష్టాన్ని ప్రభుత్వం సక్రమంగా గుర్తించలేకపోయిందన్నారు. 

సున్నావడ్డీ పథకం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం,  పథకం అమలుకు వచ్చేసరికి రాష్ట్రంలోని రైతుల సంఖ్యను 52 లక్షలనుంచి 33లక్షలకు, తరువాత 12 లక్షలకు కుదించిందన్నా రు. 12 లక్షలమంది రైతులుమాత్రమే సకాలంలో వడ్డీకట్టినట్లు ప్రభుత్వంచెబుతోందని, అంటేమిగిలిన రైతులు వడ్డీనికూడా కట్టలేని దుస్థితిలో ఉన్నారనే నిజాన్ని ఎందుకు ఒప్పుకోవడం లేదన్నారు.

వ్యవసాయం లాభసాటిగా ఉందని చెబుతున్న పాలకులు, వాస్తవాలు తెలుసుకోకుంటే, రాష్ట్రరైతాంగం మరింత నష్టపోతుందని ఆలపాటి స్పష్టంచేశారు.  పంటలబీమా సొమ్ము సకాలంలో కట్టకపోవడం వల్ల, రైతులకు మరింత నష్టం చేకూర్చారని, డిసెంబర్ నాటికి రూ.1000, రూ.1500కోట్లోఇచ్చి చేతులుదులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఉందని ఆలపాటి ఆక్షేపించారు. రూ.10వేలకోట్ల వరకు పంటనష్టం జరిగితే, దాన్ని కుదించి చెప్పారన్నారు.

ప్రభుత్వం ఇదేవిధంగా రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో మరోహరితవిప్లవం వచ్చేలా టీడీపీ రైతులతరపును ముందడుగు వేస్తుందని మాజీమంత్రి హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మచిలీపట్నం సాహితీ మిత్రుల 39వ వార్షికోత్సవ వేడుక