Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిశ యాప్‌కు మంచి స్పందన: హోం మంత్రి

దిశ యాప్‌కు మంచి స్పందన: హోం మంత్రి
, బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:37 IST)
దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన దిశ పత్యేక యాప్ పై మంచి స్పందన వస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం శాఖామంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. 

రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 50 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన వ్రాతపరీక్షా ఫలితాలను రాష్ట్ర హోం శాఖామంత్రి మేకతోటి సుచరిత డిజిపి గౌతం సవాంగ్ తో కలిసి విడుదల చేశారు.

ఈ మేరకు అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఈ ఫలితాలను విడుదల చేసిన తదుపరి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 50 ఎపిపి ఉద్యోగాల భర్తీకై పరీక్షలు నిర్వహించించేందుకు ధరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 2వేల 488 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేశారు.

వారిలో 1981 మంది వ్రాత పరీక్షలకు హాజరుకాగా వారిలో 496మంది వ్రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా వారిలో 97మందిని మౌఖిక పరీక్షలకు ఎంపిక చేయగా వారిలో 49మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

కాగా జోన్-4లో ఆర్ధోపెడికల్లీ హేండీకాప్డ్(మహిళ)కేటగిరీ కిందే కేటాయించిన ఒక ఎపిపి ఉద్యోగానికి తగిన అర్హతగల అభ్యర్థి లేకపోవడంతో ఆ పోస్టును భర్తీచేయలేదని హోంమంత్రి సుచరిత వివరించారు. 

ఎపిపి ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 22మంది పురుషులు, 27మంది మహిళలు అనగా 33శాతం రిజర్వేషన్లను మించి అనగా 50శాతం పైగా మహిళలు ఈఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషమని హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు.

ఎంపికైన వారిలో ఎం.లావణ్య 281.50 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా సిహెచ్.చంద్ర కిషోర్ 277.3శాతం మార్కులతో ద్వితీయ స్థానంలోను,తేజశేఖర్ 251 మార్కులతో తృతీయ స్థానంలోను నిలవడం జరిగిందని చెప్పారు.

ఎంపికైన అభ్యర్ధులకు వారం రోజుల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పిటిసి)లో శిక్షణకు పంపడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.

అభ్యర్ధులు వ్రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల మార్కులను తెల్సుకునేందుకు www.slprb.ap.gov.in అనే వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013లో ఈ ఎపిపి ఉద్యోగాల భర్తీని చేపట్టడం జరిగిందని చెప్పారు. ఎంపికైన అభ్యర్ధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అభినందలు తెలియజేశారని పోలీస్ శాఖ తరుపున కూడా అభ్యర్ధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్టు సుచరిత పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, అందుకు అనుమతి రాగానే అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

దిశ చట్టం గురించి హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన దిశ పత్యేక యాప్ పై మంచి స్పందన వస్తోందని, 4వేల ఫోన్ కాల్స్ వస్తే వాటిలో అత్యధిక శాతం ఆ యాప్ పనిచేస్తోందో లేదోనని పరీక్షించే కాల్స్ అధికంగా వచ్చాయని తెలిపారు. 

పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. ఎపిపి ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చర్యలు తీసుకుని సకాలంలో ఫలితాలు వెల్లడించడం జరిగిందని తెలిపారు. దిశ చట్టం తేవడంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, మిగతా చట్టాలన్నీ సక్రమంగా అమలు జరిగితేనే పూర్తిగా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

దిశ యాప్ పై ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో మంచి స్పందన వస్తోందని డిజిపి పేర్కొంటూ రాష్ట్రాన్ని మహిళా రక్షణ రాష్ట్రం(Women Safety State)గాను, ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్(Women Friendly)లు తీరిద్దిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్,పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అధ్యక్షులు మరియు అదనపు డిజిపి అమిత్ గార్క్, రాష్ట్ర ప్రాసిక్యూషన్స్ విభాగం సంయుక్త సంచాలకులు బి.రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే పెట్టుబడులు రావడం లేదు: పురంధేశ్వరి