Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వై.యస్.ఆర్. జలకళ ద్వారా రాష్ట్రంలో 2 లక్షలమంది రైతులకు ఉచితంగా బోర్లు

వై.యస్.ఆర్. జలకళ ద్వారా రాష్ట్రంలో 2 లక్షలమంది రైతులకు ఉచితంగా బోర్లు
, బుధవారం, 24 మార్చి 2021 (22:00 IST)
రాష్ట్ర ప్రభుత్వం వై.యస్.ఆర్. జలకళ పధకం క్రింద రాష్ట్రంలోని 2 లక్షలమంది రైతులకు ఉచితంగా బోరుబావులు త్రవ్వడమే కాకుండా ఉచితంగా బోర్లు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. పి.అనీల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం భూగర్భజల శాఖ స్వర్ణోత్సవాలు సందర్భంగా భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు అంశం పై ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ భూగర్భజల, గణనశాఖ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రతీ నీటిచుక్కను ఒడిసిపట్టుకుని నీటి ప్రాధాన్యతను తెలియజేసేలాగా ఎ ంతో బాధ్యతగా భూగర్భజలశాఖ తన విధులను నిర్వహిస్తోందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో సమర్ధవంతంగా పనిచేసే శాఖలలో భూగర్భజలశాఖకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదన్నారు.

ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి చిన్నవయస్సులోనే ఎంతో ప్రాధాన్యతతో కూడిన జలవనరులశాఖా మంత్రిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అందువల్లనే ఈ స్వర్ణోత్సవాలలో పాల్గొనే అదృష్టం తనకు దక్కిందన్నారు. భావితరాలకు త్రాగు, సాగునీరు అందించేందుకు నీటిని పొదుపుగా వాడడంలో, భూగర్భజలాల వివరాలను తెలియజేయడంలో ఆంధ్రప్రదేశ్ భూగర్భజలశాఖ గత 50 సంవత్సరాలుగా ఎ న్నో విశిష్టమైన అడుగులు వేసిందన్నారు. ఈవేదిక పై నుండి గతంలో పదవివిరమణ చేసిన వారి నుండి ఇప్పుడు పనిచేస్తున్నవారందరికీ తన అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు పై స్వర్ణోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యశాల భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూగర్భజలాల పరిరక్షణకు పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నదని, ప్రజలు కూడా తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని మంత్రి కోరారు. సదస్సుద్వారా గత అనుభవాలు, భవిష్యత్తులో ఎదుర్కునేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను ఒక అధ్యయనంగా నిలుస్తుందని మంత్రి అనీల్ కుమార్ అన్నారు. గత 50 సంవత్సరాలుగా వేసిన అడుగులను పుస్తకరూపంలో తేవడాన్ని మంత్రి అభినందించారు.
 
రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో జలవనరులు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తాయన్నారు. భూగర్భజలాల లభ్యతలో 80 శాతం త్రాగునీటి అవసరాలు, 50 శాతం ఇరి గేషన్ అవసరాలను తీర్చగలుగుతున్నామన్నారు. గత 50 సంవత్సరాలుగా భూగర్భజలశాఖ ద్వారా అందించిన సేవలు అనిర్వచనీయం అన్నారు.

25 సంవత్సరాలు క్రితం దేశంలోనే తొలి హైడ్రాలజీ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరస్థానం ఉందన్నారు. ఈస్వర్ణోత్సవ వేళ నిర్వహించిన సదస్సు భవిష్యత్తు తరాలకు, తదుపరి ప్రణాళికలకు ఒక వేదికగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. గత 50 సంవత్సరాలుగా రాష్ట్రానికి సంబంధించిన డేటాను సమీకృతం చేసి ఒక పుస్తకరూపంలో తేవడంలో భూగర్భజల శాఖ ఉద్యోగుల, ఇతర ఔత్సాహికుల సేవలు ప్రశంసనీయం అన్నారు.
 
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఛైర్మన్ జి.సి.పఠి మాట్లాడుతూ మార్చి 24తో భూగర్భజలశాఖ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవాలు జరుపుకోవడం, అందులో తాను భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తు తరాలకోసం భూగర్భజల సంరక్షణకు ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

నేటి ఆధునిక సమాజంలో నీటి వినియోగం ఎక్కువుగా ఉన్నందున పరిమితికి మించి భూగర్భజలాలు కలుషితం అయ్యాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నీటివనరులను ఒడిసిపట్టుకోవడం చాలా ప్రాధాన్యతా అంశం అని దాని పైనే ఆర్థిక అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. నీటి వినియోగం చేసే ప్రతీ ఒక్కరికీ భూగర్భజలాల ఆవశ్యకతను తెలియజేయడంలో మరింత చురుకైన పాత్రను పోషించాల్సి ఉందని జి.సి.పఠి అన్నారు.
 
హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజినీర్ టి.వి.యన్. రత్నకుమార్ మాట్లాడుతూ మానవుల జీవన విధానంలో నీరు ప్రధాన జీవనాధారంగా నిలుస్తోందన్నారు. ప్రకృతివరంగా భూమి పై 70 శాతం నీరు ఉందన్నారు. అందులో 4 శాతం మాత్రమే త్రాగునీరుగా లభ్యం అవుతోందని, అయితే అందులో కేవలం 1 శాతం మాత్రమే వినియోగించుకో గలుగుతున్నా మన్నారు. నీటిని దేవునిగా భావించాలని నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచబ్యాంకు నీటి సంరక్షణ కోసం నిధులను ఇవ్వడం జరుగుతోందని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశలో పధకాలకు ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఈనిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఆయన సభలో ప్రస్తావించారు.
 
రాష్ట్ర భూగర్భజల గణన శాఖ సంచాలకులు ఏ. వరప్రసాద్ రావు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రియల్ టైమ్‌లో భూగర్భజలాల స్థాయిని పర్యవేక్షించి, వాటి వివరాలను సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అన్నారు. తొలి ఫిజియోమీటర్ కూడా నిర్మించిన ఘనత మనదన్నారు. జలవనరుల సమాచారాన్ని యాజమాన్య వ్యవస్థను రూపొందించడమే కాకుండా వ్యవసాయ బోర్లు అన్నింటినీ కూడా జియోట్యాగింగ్ చేసిన తొలిరాష్ట్రం ఏపి అన్నారు.

నీతిఅయోగ్ వారి సమ్మిళిత జలయాజమాన్యం సూచిలో రాష్ట్ర భూగర్భజల విభాగం ప్రధమర్యాంకు సాధించడం మనందరికీ గర్వకారణం అన్నారు. 50 సంవత్సరాలు స్వర్ణోత్సవాల సమయంలో గత స్మృతులను అవలోకనం చేసుకుంటే చిన్న న్యూక్లియస్ గా ఏర్పడిన ఈశాఖ తదనంతరం ఉన్నత శిఖరాలకు చేరడం అందులో ఉద్యోగుల కృషి ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. భవిష్యత్తు తరాలకు దశాదిశ చేసే మార్గదర్శకంగా ఎ న్నో వినూత్న ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వాటి వివరాలను పుస్తకరూపంలో తేవడంలో ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ ప్రక్రియకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జాతీయ సదస్సులో కేంద్ర గ్రౌండ్ వాటర్ బోర్డు ఛైర్మన్ జి.సి.పంత్ భూగర్భజల రంగంలో ఎదుర్కుంటున్న సవాళ్ల పై ప్రసంగించారు. అనంతరం మాజీ డైరెక్టర్ జనరల్ (ఇండియన్ మెట్రాలజికల్ శాఖ) వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటివనరుల సమర్ధత, నిర్వహణ అంశంపైనా, కేంద్ర గ్రౌండ్ వాటర్ బోర్డు మెంబరు పి.నందన్‌కుమార్ భూగర్భజలాల స్థిరత్వాన్ని నిర్ధారించడంలో

నిర్వహణ, వాటి ప్రాముఖ్యత
అంశం పైనా, యన్ ఐ హెచ్ హెడ్ డా. వై.ఆర్.యస్. రావు తీరప్రాంతాలలో నీటినాణ్యతా అంశం పైన ప్రొఫెసర్ పి.రాజేంద్రప్రసాద్ భూగర్భజలాల నిర్వహణలో సవాళ్లు, వాస్తవరూపంలో తీసుకోవాల్సిన చర్యలపైన, ఇయన్‌సి సి.నారాయణరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటివనరుల సమాచారం సమర్ధ నిర్వహణ వ్యవస్థ పైన ప్రసంగించారు. ఈసదస్సులో భాగంగా 13 జిల్లాల భూగర్భ జలశాఖ అధికారులు రూపొందించిన 13 పుస్తకాలను, గత 50 సంవత్సరాలుగా భూగర్భజలశాఖ అమలుచేసిన ప్రణాళికలు, పరిశోధనలు సమాహారంగా రూపొందించిన పుస్తకాన్ని, సావనీర్లను మంత్రి చేతులుమీదుగా ఆవిష్కరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత ఇల్లు కొన్నాడు.. అంతే షాకయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే..?