Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పేదలకు రెండోవిడత ఉచిత బియ్యం, శనగలు పంపిణీ

ఏపీలో పేదలకు రెండోవిడత ఉచిత బియ్యం, శనగలు పంపిణీ
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:34 IST)
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జరుగుతున్న లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా గురువారం రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

బియ్యంకార్డుదారులకు ఉదయం ఆరుగంటల నుంచి బియ్యం, శనగల పంపిణీ చేపట్టారు. ప్రతి బియ్యంకార్డుదారుడికి కేజీ శనగలు, కార్డులోని ఒక్కో సభ్యుడికి అయిదు కేజీల బియ్యంను ఉచితంగా అందచేశారు. కరోనా కారణంగా రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా వుండేందుకు ప్రభుత్వం ముందుచూపుతో టైంస్లాట్ తో కూడిన కూపన్ల విధానంను ముందుకు తీసుకువచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కార్డులు కలిగిన ప్రతి కుటుంబంకు ఏ రేషన్ దుకాణంలో, ఏ సమయానికి, ఏ తేదీలో రేషన్ కోసం రావాలో నిర్దేశిస్తూ కూపన్లను అందచేశారు. దాని ప్రకారం లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద భౌతిక దూరంను పాటిస్తూ రేషన్ ను తీసుకున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో వున్న 29,620 రేషన్ దుకాణాలకు అదనంగా 14,315 కౌంటర్లను ఏర్పాటు చేశారు.

అధికంగా రేషన్ కార్డులు కలిగివున్న 8 వేల దుకాణలకు సింగిల్ కౌంటర్, 3800 దుకాణాలకు రెండు కౌంటర్లు, 2,500 షాప్ లకు అదనంగా మూడు  కౌంటర్లును ఏర్పాటు చేశారు. దీనితో పాటు రాష్ట్రంలో గుర్తించిన 46 మండలాల్లోని రెడ్ జోన్ లలో నేరుగా వాలంటీర్లు బియ్యం కార్డుదారులకు రేషన్ ను డోర్ డెలివరీ చేశారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజున 18,33,245 కుటుంబాలకు బియ్యం, శనగలు పంపిణీ చేశారు.  పోర్టబిలిటీ ద్వారా 3,51,245 కుటుంబాలు రేషన్ అందకున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ కోన శశిధర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,620 రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 1,47,24,017 రేషన్ కార్డులు వున్నాయి.

తొలిరోజున 26,712.441 మెట్రిక్ టన్నుల బియ్యం, 1714.302 మెట్రిక్ టన్నుల శనగలను లబ్దిదారులకు అందచేశారు. రేషన్ కార్డు దారులు ఒకేసారి రేషన్ దుకాణాల వద్ద గుంపులుగా రాకుండా ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి మూడు పూటలా నిర్ధేశిత టైం స్లాట్ లలో సరుకులను అందిస్తామని అధికారులు ముందుగానే ప్రచారం చేశారు.

కరోనా నియంత్రణలో భాగంగా రేషన్ దుకాణం వద్దకు వచ్చే వారు కనీసం మీటరు దూరం పాటిస్తూ వరుసలో వేచివుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విఆర్వో, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ తో లబ్దిదారులకు సరుకులను పంపిణీ చేశారు. అలాగే రేషన్ దుకాణాల వద్ద సబ్బు, శానిటైజర్ లను అందుబాటులో వుంచారు.

కేంద్రప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది ఆహార భద్రతా పథకం కింద కేవలం 92 లక్షల కుటుంబాలకే వర్తిస్తోంది. దీనిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వున్న బియ్యంకార్డుదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండోవిడతగా ఉచిత బియ్యం. కేజీ శనగల అందించేందుకు చర్యలు చేపట్టింది. దీనికోసం అదనంగా పడే భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకు 3 వేల పరీక్షలు చేస్తున్నాం: వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి