Publish Date: Tue, 31 Mar 2020 (06:20 IST)
Updated Date: Tue, 31 Mar 2020 (06:25 IST)
తెలంగాణలో లాక్డౌన్ కారణంగా పేదలకు నగదు పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఒక్కో తెల్లరేషన్ కార్డు దారుడికి రూ.1500 చొప్పున నగదు పంపిణీ చేయనున్నారు. నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయనున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మూడున్నర లక్షల పైగా కూలీలకు 500 రూపాయల చొప్పున నగదు ఇవ్వనున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదలకు ఇబ్బంది లేకుండా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. బియ్యంతోపాటు ఇతర నిత్యావసరాల కొనుగోలుకు ఆహారభద్రతా కార్డుదారులకు రూ.1500 నగదు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
రూ. 1,314 కోట్లు రాష్ట్రంలో 87 లక్షల 59 వేల ఆహార భద్రతా కార్డుదారులకు రూ. 1,314 కోట్లు పంపిణీ చేయనున్నారు. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదును జమ చేయనున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల సంస్థ వద్ద ఉన్న ఆహారభద్రతా కార్డుదారుల వివరాలను ఉపయోగించుకోనున్నారు.
రాష్ట్రంలోని కార్డులన్నీ ఆధార్తో అనుసంధానం అయ్యాయి. ఆధార్తో బ్యాంకు ఖాతాల అనుసంధానం కూడా దాదాపుగా పూర్తైంది. ఖాతాల్లోకి సొమ్ము... 97 శాతం ఆహారభద్రతా కార్డులు కలిగిన కుటుంబాల బ్యాంకు ఖాతాల వివరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
నగదు పంపిణీ కోసం అవసరమైన మొత్తాన్ని సిద్ధంగా ఉంచామని, ప్రభుత్వం తేదీ ఖరారు చేసి, పౌరసరఫరాల శాఖ నుంచి వివరాలు అందగానే నగదును ఖాతాల్లో జమచేస్తామని ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. వలస కూలీలకు రూ.500 ఒకటి, రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోనే చిక్కుకుపోయిన కూలీలకు కూడా 12 కిలోల బియ్యంతోపాటు ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారు మూడున్నర లక్షలకు పైగానే ఉన్నట్లు అంచనా.