Publish Date: Sat, 22 Feb 2020 (15:34 IST)
Updated Date: Sat, 22 Feb 2020 (15:36 IST)
ఏపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.
గ్రామ వాలంటీర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు తొలగించారని.. రాష్ట్రంలో మంత్రులంతా డమ్మీలు అయ్యారన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో సీఎం జగన్ దుర్మార్గాలు చేస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు.
అలాగే, టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకే అచ్చెన్నపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ తరపున బలంగా వాయిస్ వినిపించడంతో టార్గెట్ చేశారని ఆరోపించారు. బలహీనవర్గాల నేతలు రాజకీయంగా ఎదగడం జగన్కు ఇష్టం లేదని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
మరోనేత శ్రవణ్ మాట్లాడుతూ, వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు శ్రవణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. జగన్ తన బురదను అందరికీ అంటించాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రజలంతా ఖండించాలన్నారు. పోలీసులతో సిట్ వేయడం రాజకీయ కక్ష సాధింపే అని శ్రవణ్ వ్యాఖ్యానించారు.