Publish Date: Sat, 21 Nov 2020 (07:00 IST)
Updated Date: Sat, 21 Nov 2020 (09:40 IST)
ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా ఉన్న అంశంగా చెప్పాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట వింటే చాలు ఏపీ ప్రభుత్వ పెద్దలు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు.
ఆయన విషయంలో చాలా సీరియస్గా ఉన్న సిఎం జగన్ అయితే ప్రధాన కార్యదర్శిని కూడా కట్టడి చేస్తున్నారు. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీనిపై ఇప్పుడు నిమ్మగడ్డ కాస్త సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల నిర్వహణ విషయంలో ఆయనను రాష్ట్ర సర్కార్ అడ్డుకుంటుంది. అయితే ఇప్పుడు నిమ్మగడ్డకి కేంద్ర ఎన్నికల సంఘం పెద్దల నుంచి పిలుపు వచ్చిందని సమాచారం.
మార్చ్ లో ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుంచి ఎవరు ఏది మాట్లాడారు…? అధికారులు ఎవరు సహకరించలేదు…? ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు…? ఆర్డినెన్స్ లో పొందు పరిచిన అంశాలు ఏంటీ…?
ఇప్పుడు హైకోర్ట్ ఆదేశాల తర్వాత మీ మీద విమర్శలు వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారు ఎవరు…? మీరు సమావేశం నిర్వహించాలి అని భావిస్తే సహకరించని అధికారులు ఎవరు…? మీరు లేఖలు రాసినా ఆదేశాలు ఇచ్చినా సరే స్పందించని అధికారులు ఎవరు…? మీరు గవర్నర్ కి చేసిన ఫిర్యాదులో ఏం ఏం ప్రస్తావించారు…?
రాష్ట్రంలో ఇతర ఎన్నికల అధికారులు ఎవరు ఎవరు మీకు సహకరించడం లేదు…? ఈ అంశాలకు అన్ని సమాధానాలు సిద్దం చేసుకుని డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ రావాలని ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.