ముఖంపై నల్లటి మచ్చలు ఉండటంతో అందంగా లేనని భావించిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మాణిక్యపురంలో జరిగింది.
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డిగ్రీ విద్యార్థి సునీల్ నాయక్ (20) ముఖంపై చిన్నప్పటి నుంచి మచ్చలు ఉండేవి. అందవిహీనంగా కనపడుతున్నానని ప్రతి రోజు బాధపడేవాడు. ఈ మచ్చలు పోయేందుకు ఎన్నో రకాలైన క్రీములు వాడాడు. వైద్యులను సంప్రదించాడు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో కుంగిపోయాడు.
	 
	కాలేజీకి వెళ్లే సమయంలో ముఖంపై కర్చీఫ్ కప్పుకునే వెళ్లేవాడు. తాను అందంగా లేకపోవడంతో భవిష్యత్తులోనూ తననందరూ చులకనగా చూస్తారని భావించాడు. ఈ బాధతోనే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
	 
	పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు.. సోంపేట ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు. నేడు కరోనా పరీక్ష చేసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.