Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగుల జీతాల్లో కోత..! త్వరలో తెలుగు ప్రభుత్వాల నిర్ణయం?

ఉద్యోగుల జీతాల్లో కోత..! త్వరలో తెలుగు ప్రభుత్వాల నిర్ణయం?
, సోమవారం, 30 మార్చి 2020 (16:58 IST)
కరోనా కల్లోలంతో కకావికలమైన తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ని గట్టెక్కించేందుకు ఇద్దరు సీఎంలు కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారా?.. ఇందులో భాగంగా ఉద్యోగుల జీతభత్యాలపై కోత పెట్టేందుకు వ్యూహం రచించారా?.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.
 
కరోనా ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ పూర్తిగా నిలిచిపోయింది. కరోనా సహాయ చర్యల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయ్యాయి.

దీంతో కీలక నిర్ణయం దిశగా రెండు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఏపీ తెలంగాణలోని దాదాపు 14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మూడు శాఖల మినహా మిగిలినవారికి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు వేతనాల్లో కోత విధించే దిశగా తుది కసరత్తు జరుగుతోంది. 
 
కరోనా ఎఫెక్ట్‌తో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోవడంతో పాటుగా లాక్‌డౌన్ కారణంగా ప్రతినెలా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే రెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా స్తంభించాయి.

దీంతో ప్రభుత్వ ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలోనూ ఎక్సైజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌ ద్వారానే ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. రెండు రాష్ట్రాల్లో పెట్రోల్ ఉత్పత్తుల ద్వారా వచ్చే పన్నులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. 
 
ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ తెల్ల కార్డు దారులకు నగదు రూపేణా ఆర్థికసాయం ప్రకటించారు. ఏపీలో బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తున్నారు. దీంతో పాటు కరోనా నివారణ చర్యల కోసం రెండు ప్రభుత్వాల మీద అదనపు భారం పడింది.

కేంద్రం పరిస్థితి దాదాపు ఇదేవిధంగా ఉండటం, కొత్త రుణాలు వచ్చే అవకాశం లేకపోవడం, కేంద్ర పన్నుల వాటాలో ఆదాయం కూడా రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వంలో భాగంగా చెప్పుకునే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
 
ఇక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సైతం ఈనెల జీతాలు ఇవ్వకూడదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా వేతనాలు, పెన్షన్ల రూపంలో దాదాపు 2700 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రస్తుత గడ్డు కాలంలో వేతనాలపైన 30శాతం మేరా కోత విధించే అవకాశం కనిపిస్తోంది.

దీనిపైన ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సమాయాత్తమవుతోంది. అయితే కరోనా సేవల్లో నిమగ్నమైన వైద్య ఆరోగ్యశాఖ పోలీస్, మున్సిపల్ సిబ్బందికి మాత్రం పూర్తి వేతనాలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ అన్ని రకాల రుణాల చెల్లింపుల పైనా మూడు నెలల మారిటోరియం విధించడంతో ఉద్యోగులకు కొంత వెసులుబాటు కలిగింది. దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
 
కష్టకాలంలో ఉన్న ఈసమయంలో ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులు సైతం సహకరించాలనే పిలుపుతో ఈ నిర్ణయం అమలు దిశగా తుది చర్చలు జరుగుతున్నాయి.

మూడు నెలల పాటు ఇదే రకంగా వేతనాల్లో కోత ఆ తర్వాత కోత విధించిన సొమ్మును దశలవారీగా చెల్లింపులు చేసే విధంగా ప్రభుత్వాల వద్ద ప్రతిపాదనలు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. పెన్షనర్ల విషయంలో మాత్రం ఎటువంటి మినహాయింపులు లేకుండానే చెల్లింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూగోలో కలవరం... రెండు పాజిటివ్ కేసులు.. ఏపీలో కేసులు 23