Publish Date: Mon, 18 May 2020 (22:29 IST)
Updated Date: Mon, 18 May 2020 (22:32 IST)
ఆపద మ్రొక్కులవాడా.. అనాథ రక్షకా గోవిందా..గోవిందా అంటే పలికే స్వామి తిరుమల వేంకటేశ్వరస్వామి. ఆ స్వామివారి దర్సనం కోసం ఎంతో శ్రమతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలాంటి ఆలయం మూసివేసి 50రోజులకు పైగా దాటుతోంది. దీంతో కోట్ల రూపాయల నష్టం టిటిడికి వచ్చింది.
అయితే టిటిడి లెక్కల ప్రకారం ప్రతి రోజు 5 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిత సేవా టిక్కెట్లు, హుండీ ఆదాయం, తలనీలాలు ఇలా వివిధ రూపాల్లో ఆదాయం వస్తుంటుంది. కానీ ఈ మొత్తం ఆదాయం నిలిచిపోయింది. మార్చి 20వ తేదీన ఆలయంలోకి భక్తుల అనుమతిని నిలిపివేశారు.
ఆ తరువాత మళ్ళీ భక్తులను ఎవరినీ అనుమతించడం లేదు. మళ్ళీ లాక్ డౌన్ను పొడిగించారు. ఈనెల చివరి వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది టిటిడి కూడా. దీంతో ఇప్పటివరకు మాత్రమే 285 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది.
ఇక తిరుమలలో వ్యాపారాల గురించి తెలిసిందే. భక్తుల కోసం టోపీలు, చిన్న చిన్న దండలు, హోటళ్ళు ఇలా ఎన్నో తిరుమలలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా మూతపడిపోయాయి. దీంతో చివరకు తిరుమలలో షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మళ్ళీ ఆలయంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు.. భక్తులతో తిరుమల ఎప్పుడు కళకళలాడుతుందా అని ఎంతో ఆత్రుతగా స్థానిక షాపు యజమానులు ఎదురుచూస్తున్నారు.