Publish Date: Fri, 20 Mar 2020 (22:20 IST)
Updated Date: Fri, 20 Mar 2020 (22:23 IST)
ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్సించే భక్తులు సంఖ్య ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ప్రధాన క్షేత్రాలైతే ఇక చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. చిత్తూరు జిల్లాలో వున్నటువంటి పుణ్యక్షేత్రాలైతే ఇక చెప్పనవసరం లేదు. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్సించుకుంటూ ఉంటారు. వారాంతాల్లో అయితే లక్షమందికి పైగా భక్తులు వస్తుంటారు. ఇది తెలిసిన విషయమే.
అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో తిరుమల మాత్రమే కాదు అనుబంధ ఆలయాలన్నీ పూర్తిగా మూసివేశారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామికి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామాలయం మొత్తం మూసేశారు.
ఆలయాల వద్ద అస్సలు భక్తులు లేరు. తిరుమలలో మాత్రం భక్తులు అక్కడక్కడా ఉన్నా.. వారిని కూడా టిటిడి కిందకు దింపేస్తోంది. ఇక మిగిలిన ఆలయాల వద్ద అస్సలు భక్తుల తాకిడి కనిపించలేదు. మరో ప్రధాన విషయమేమిటంటే బ్రహ్మోత్సవాలను ఆలయంలోపలే నిర్వహించబోతోంది టిటిడి. అది కూడా కోదండరామాలయం బ్రహ్మోత్సవాలు ఈనెల 23వ తేదీ నుంచి నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది.
అయితే కరోనా ప్రభావంతో ఆలయాన్ని మూసేస్తారు కాబట్టి.. ఆలయంలోపలే వాహన సేవలు కొనసాగబోతున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయం లోపలే వాహనాలపై ఊరేగనున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదంటోంది టిటిడి.