Publish Date: Tue, 12 Jan 2021 (13:45 IST)
Updated Date: Tue, 12 Jan 2021 (13:46 IST)
విజయవాడ: జిల్లా పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు సీఎం జగన్ పుష్ప గుచ్చం అందించి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఉదయం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గవర్నర్ రావడంతో ఆలయ అధికారులు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అధికారులు పండితుల చేత వేద ఆశీర్వచనం అందించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర మంత్రులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ అయిన తర్వాత ఆయన మొదటి సారిగా అమ్మవారిని దర్శించుకున్నారు. కోవిడ్ కారణంగా ఎంతోమంది చాలా ఇబ్బందులకు గురయ్యారని, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ టీకా రావడం సంతోషంగా ఉందన్నారు. వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని బండారు దత్తాత్రేయ పిలుపు ఇచ్చారు.