Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ వరద బాధితుల్లో అర్హులైన వారికి సాయం చేస్తాం : సీఎం చంద్రబాబు

flood victims

ఠాగూర్

, మంగళవారం, 1 అక్టోబరు 2024 (08:33 IST)
విజయవాడ వరద బాధితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, వాటిని పరిశీలించి నిజమైన బాధితులకు సాయం అందిస్తామని తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ శుక్రవారం నాటికి సాయం పంపిణీ పూర్తికావాలని ఆయన ఆదేశించారు. 
 
 భారీవర్షాలు, వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నగదు విడుదల చేసినా.. సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరద బాధితుల ఖాతాల్లో ఆర్థికసాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని స్పష్టంచేశారు. నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదన్నారు.
 
'రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి సంబంధించి... లబ్ధిదారుల ఖాతాల్లో రూ.588.59 కోట్లు జమయ్యాయి. 97 శాతం మంది ఖాతాల్లోకి నగదు చేరింది' అని అధికారులు సీఎంకు వివరించారు. 'ఖాతా వాడకంలో లేకపోవడం, ఆధార్‌ అనుసంధానం కాకపోవడం, కొన్ని ఖాతాలు క్లోజ్‌ కావడం, ఎకౌంట్‌ నంబరు తప్పుగా నమోదు కావడం, వివరాలు సరిగా లేకపోవడం తదితర సాంకేతిక సమస్యల కారణంగా 22,185 మంది ఖాతాల్లో సాయం జమ కాలేదు. బ్యాంకుకు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని వారికి సూచించాం. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది' అని తెలిపారు. 
 
ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేస్తున్నారని.. వాటిని పరిశీలించి అర్హులైన వారికి సాయం అందిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఖాతాల్లో డబ్బు పడని వారు.. సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. దెబ్బతిన్న వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్‌ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్‌ వస్తువుల మరమ్మతులు తదితర అంశాలపైనా సీఎంకు వివరించారు. మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు చివరి దశ పోలింగ్