ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణాలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, చంద్రబాబు మాట్లాడకపోవటం దురదృష్టకరమని, చంద్రబాబు హయాంలోనే బ్రిజేష్ ట్రిబ్యూనల్లో ఏపీకి నీటి కేటాయింపులో అన్యాయం జరిగిందని విమర్శించారు.
తెలంగాణ సర్కార్ నిర్మించే పాలామూర్ - డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీకి 120 టీఎంసిల నష్టం జరుగుతోందన్నారు. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా టీ సర్కార్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న బాబు ప్రశ్నించకపోవడం దారుణమని, తెలంగాణా ప్రభుత్వంతో బాబు అంతర్గత ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
అనుమతులులేని ప్రాజెక్టులు ఆపకపోతే, రాయలసీమ ఎడారి కావడం ఖాయమని ఎమ్మెల్యే చెప్పారు. కేసీయార్ ప్రభుత్వం నీళ్ళు దోచుకుంటున్నా ఆఖిలపక్షం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పాలన పక్కన పెట్టి రెండేళ్లుగా ఏపీ సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. అందుకే జగన్ ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం మే 16,17,18 తేదీలలో కర్నూలులో దీక్ష చేస్తున్నారన్నారు.