Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ ఓ అరాచకవాది .. కాంగ్రెస్‌తో చేరి మోడీ సర్కారును అస్థిపరిచేందుకు కుట్ర : బీజేపీ ఎమ్మెల్యే

nallamilli ramakrishna reddy

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (10:04 IST)
ఏపీలోని అనపర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ అరాచకవాది అని ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారన్నారు. అవసరమైతే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపారని తెలిపారు. 'జగన్ పాలనలో 2019 నుంచి 2024 వరకు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ఆ అప్రకటిత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ప్రజలు కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. ఎప్పుడైనా సరే ప్రజలు నియంత పాలనను అంగీకరించరు అని దీని ద్వారా తెలుసుకోవచ్చన్నారు. 
 
అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులేస్తున్నాడు. మంగళవారం బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలిసి మాట్లాడాడు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపిస్తే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సంసిద్ధం అని ప్రతిపాదించే నిస్సహాయ స్థితికి చేరాడు. వైసీపీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, అందులో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి! నలుగురు ఎంపీలు గెలిస్తే, వారిలో ఎంతమంది తనతో కలిసి వస్తారో తెలియదు! ఉన్న రాజ్యసభ సభ్యులు ఇక ముందు కూడా తనతోనే ఉంటారో, ఉండరో తెలియని పరిస్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. 
 
అంతెందుకు... పులివెందులకు వెళితే అక్కడ కార్యకర్తలే తన ఇంటిపై దాడి చేస్తే జగన్ నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కడప జిల్లాలో గెలిచిన వైసీపీ అభ్యర్థులు కానీ, ఓడిన అభ్యర్థులు కానీ కడప రాజప్రాసాదం వైపు చూడని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి అరాచక శక్తులన్నీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే అవకాశముంది' అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభ స్పీకర్ ఎన్నికలకు వైకాపా సపోర్ట్... ఓం బిర్లాకు మద్దతు