విశాఖపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు అధికార టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం వారంతా వైజాగ్ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12మంది కార్పొరేటర్లు వైకాపాను వీడి కూటమి చెంతకు చేరగా మరో 9 మంది కార్పొరేటర్లు మంగళవారం టీడీపీలో చేరనున్నారు.
వీరిలో చల్లా రజని, గేదెల లావణ్య, సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణిలతో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 29 మంది కార్పొరేటర్లు గెలవగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైకాపా నుంచి 11 మంది నేరుగా టీడీపీలో చేరారు.
అలాగే, జనసేన పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉండగా, వైకాపా, స్వతంత్రలుగా గెలిచిన ఏడుగురు జనసేన పార్టీలో చేరారు. బీజేపీ నుంచి ఒక కార్పొరేటర్ గెలవగా, ఇటీవల వైకాపా నుంచి మరొకరు ఆ పార్టీలో చేరారు. దీంతో కూటమి బలం 52కు చేరింది. తాజాగా మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు టీడీపీలోకి రావడంతో కూటమి బలం 61కు చేరింది.
మొత్తం 98 మంది కార్పొరేటర్ స్థానాలు ఉన్న విశాఖ మున్సిపాలిటీలో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. జీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీ కూటమికి ఉండటంతో 19వ తేదీన వైకాపాకు చెందిన మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ కార్పొరేటర్లు ప్రవేశపెట్టనున్నారు. కూటమి బలం వివరాలతో జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు వారంతా లేఖ రాశారు.