Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఊళ్ళోకి వచ్చారో... మర్యాద ఉండదు.. అధికారులకు భోగాపురం గ్రామస్తుల హెచ్చరిక

మా ఊళ్ళోకి వచ్చారో... మర్యాద ఉండదు.. అధికారులకు భోగాపురం గ్రామస్తుల హెచ్చరిక
, శనివారం, 3 అక్టోబరు 2015 (08:01 IST)
అనుమతుల్లేకుండా మా భూముల్లో సరిహద్దులు.. రాళ్లు నాటడానికి మీరెవరు..? సర్వేలంటూ మా గ్రామాల్లోకి అడుగు పెడితే మర్యాద దక్కదంటే అంటూ భోగాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికార బృందంపై విరుచుకుపడ్డారు. వాహనాలను అడ్డుకున్నారు. పాతిన నంబర్ రాళ్ళను తొలగించేశారు. ఆ ప్రాంతంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే అదే సమయంలో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రైట్స్‌ సంస్థకు చెందిన కేంద్ర బృందం సభ్యులు రాజులమెట్ట, తూడెం, రావాడ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్‌పోర్టు సరిహద్దులు గుర్తించి సర్వే రాళ్లు పాతారు. రావాడ గ్రామంలో సర్వే నిర్వహిస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. 
 
అనుమతి లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు పాతిన రాళ్లను వారు తొలగించారు. అధికారులు వాహనశ్రేణిని అడ్డుకున్నారు. వాహనాల ముందు పడుకోవడానికి ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన రైతులలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
 
రావాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది రైతులు, మహిళలు కలిసి భోగాపురం పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఒక దశలో మహిళలు పోలీసు స్టేషన్‌ ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టడంతో వెళ్లిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu