Publish Date: Sat, 28 Feb 2026 (11:01 IST)
Updated Date: Sat, 28 Feb 2026 (11:04 IST)
వేగంగా బరువు తగ్గాలని, త్వరగా బాడీబిల్డింగ్ చేయాలని కొందరు అధికంగా వ్యాయామం చేస్తున్నారు. అయితే జిమ్లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ప్రస్తుతం ఎక్కువగానే వుంది. తాజాగా జిమ్లో చేరిన వారానికే బ్యాంక్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. విశ్వనాథ్ (27) వి.కోటలో ఉన్న డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రతిరోజులాగే ఉదయం జిమ్కు వెళ్లి వ్యాయామం చేశారు. వ్యాయామం చేస్తూ అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
అధికంగా వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.