Publish Date: Fri, 08 Nov 2024 (20:06 IST)
Updated Date: Fri, 08 Nov 2024 (20:16 IST)
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో స్థానం సంపాదించారు. ఇటీవల ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని కౌన్సిల్కి పంపి, కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ పట్టుబట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో బాలినేని జనసేనకు మేలు చేస్తారని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు.
అయితే, టీడీపీ లేదా కూటమి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇది చాలా ప్రమాదకర నిర్ణయం అని కొందరు భావిస్తున్నారు. బాలినేని జనసేనలో చేరడం ఇప్పటికే జిల్లాలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జిల్లాలో టీడీపీ నాయకత్వం బాలినేనితో ఏళ్ల తరబడి పోరాడి ఎన్నో వేధింపులను ఎదుర్కొందన్నారని కొందరు నాయకులు చెబుతున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన స్థానిక నాయకత్వాన్ని కూడా బాలినేని వేధించారన్న విమర్శలున్నాయి. ఆయన్ను మంత్రిని చేయడం వల్ల జిల్లాల్లో తప్పుడు సంకేతాలు వెళతాయనీ, బాలినేని ప్రస్తుతానికి జనసేనలో ఆశ్రయం పొందుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. మంచి సమయం చూసుకుని బాలినేని పార్టీని వీడి తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్లోకి వెళ్లిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఐతే... ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా... ఇప్పటికే బాలినేనికి- పవన్ కల్యాణ్ కి మంచి స్నేహం వుంది. బాలినేని సహజంగా ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత మరలా మార్చుకోవడం దుర్లభం అని ఆయన సన్నిహితులు చెప్పే మాట. ఏదేమైనప్పటికీ జనసేనాని ఏ పని చేసినా ఒకటికి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కనుక బాలినేని విషయంలో ఆయన ఏం చేసినా మాకు ఇష్టమే అంటున్నాయి జనసేన శ్రేణులు.