Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివేకా హత్య కేసు : అప్రూవర్ దస్తగిరి భార్యపై వైకాపా కార్యకర్తల దాడి

Advertiesment
dastagiri wife shabana

ఠాగూర్

, ఆదివారం, 16 మార్చి 2025 (19:41 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ఆయన కారు డ్రైవర్ దస్తగిరి భార్య షాబానపై కొందరు వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇద్దరు వైకాపా మహిళా కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని దస్తగిరి భార్య వెల్లడించింది. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం, మల్యాల గ్రామంలో శనివారం సాయంత్రం ఈ దాడి జరిగినట్టు ఆమె తెలిపింది. మల్యాల గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లిన షాబానపై ఇద్దరు మహిళా కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి ఉద్దేశపూర్వకంగానే బూతులు తిడుతూ తనపై దాడి చేశారని షాబాన తొండూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
పైగా, మరో యేడాదిలో నీ భర్త దస్తగిరిని చంపేస్తామని ఆ ఇద్దరు మహిళా కార్యకర్తలు హెచ్చరించారని షాబాన ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నీ భర్త మాట్లాడేంత ధైర్యవంతుడా అంటూ విచక్షణా రహితంగా కొట్టారని షాబాన పేర్కొన్నారు. అదేసమయంలో మరో ఇంట్లో ఉన్న దస్తగిరి సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆ ఇద్దరు మహిళా కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయి పరుష పదజాలంతో దూషించారని తెలిపారు. 
 
కాగా, వివేకా వాచ్‌మెన్ రంగన్న చనిపోయిన వెంటనే దస్తగిరిని కూడా చంపడానికి వైకాపా నేతలు కుట్రలు పన్నుతున్నారని, కావాలని ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకుని ఘర్షణలకు దారితీస్తున్నారని షాబాన పేర్కొన్నారు. తొండూరు పులివెందుల రూరల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని షాబానా వాపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కల కోసం ఇంటిని అమ్మేసిన యువకుడు