Publish Date: Thu, 11 Jun 2020 (21:05 IST)
Updated Date: Thu, 11 Jun 2020 (21:06 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం గవర్నర్ హరిచందన్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. 16వ తేదీన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.
కరోనా మూలంగా వాయిదా పడిన బడ్జెట్ సమావేశాలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు.
మొదటి రోజు సభ ముగిసిన తర్వాత బడ్జెట్ రాష్ట్రంలోని ఇతర సమస్యలపై ఏయే అంశాలపై ఎంతెంత సమయం కేటాయించాలో శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.
ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనుండడంతో ఈ సమయంలోనే బడ్జెట్ సమావేశాలు కలిసొచ్చేలా సమావేశాలకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే, శాసనమండలిని ఏపీ సర్కారు రద్దు చేసింది. దీనికి కేంద్రంతో పాటు పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సివుంది. కానీ, అది ఇంకా జరగలేదు. దీంతో శాసనమండలి జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సివుంది.