Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నెర్రజేసిన నిమ్మగడ్డ : ద్వివేది - గిరిజా శంకర్‌లపై అభిశంసన!

కన్నెర్రజేసిన నిమ్మగడ్డ : ద్వివేది - గిరిజా శంకర్‌లపై అభిశంసన!
, బుధవారం, 27 జనవరి 2021 (09:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నెర్రజేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో వారిద్దరూ అడుగడుగునా ఘర్షణపూరితంగా, సహాయ నిరాకరణ ధోరణితో వ్యవహరించారని ఆక్షేపిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌లపై బదిలీ వేటు వేశారు. అంతేకాదు.. వారి సర్వీసు రికార్డులో నమోదయ్యేలా ‘అభిశంసన (సెన్ష్యూర్‌)’ కూడా చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
వీరిద్దరూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రతకూ భంగం కలిగించేందుకు యత్నించారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు, ఉద్యోగులను సమకూర్చే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టుకు ఇచ్చిన హామీని సైతం 'వారికి మాత్రమే తెలిసిన కారణాలతో' అమలు చేయలేదని పేర్కొన్నారు. 
 
'వీరి పనితీరులో పరిపక్వత, విజ్ఞత లోపించాయి. ఈ కారణంగా 2021 ఓటర్ల జాబితాలు సిద్ధం కాలేదు. ఫలితంగా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 3.62 లక్షల మంది యువ ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే సువర్ణావకాశాన్ని కోల్పోయారు' అని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను నిర్వహించిన అనుభవం కలిగిన ద్వివేది ఈ విధంగా ప్రవర్తించడం మరింత గర్హనీయమని నిమ్మగడ్డ తెలిపారు. 
 
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత కొంత కాలంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలు.. వాటిని తొలగించి, ఎన్నికలను సజావుగా, సకాలంలో నిర్వహించేందుకు ఎస్‌ఈసీ చేసిన ప్రయత్నాలు, న్యాయస్థానాల్లో కేసులు మొదలైనవాటి పరిణామక్రమాన్ని తన ఉత్తర్వుల్లో వివరించారు. 
 
ద్వివేది, గిరిజా శంకర్‌ల బదిలీ, అభిశంసనలకు దారి తీసిన కారణాల్లో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడాన్ని అత్యంత ప్రధానమైనదిగా నిమ్మగడ్డ పరిగణించారు. ఇటీవలి కాలంలో 18 సంవత్సరాలు నిండిన 3.62 లక్షలమంది యువతీయువకులు తమ జీవితాల్లో తొలిసారి ఓటు వేసేందుకు వీలు కల్పించే ఈ జాబితాలను రూపొందించి.. ఎస్‌ఈసీకి అందజేయడంలో వీరు ఘోర నిర్లక్ష్యం వహించారని తెలిపారు. 
 
అంతేకాకుండా, పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో రాజ్యాంగ స్ఫూర్తికి, అధికారుల ప్రవర్తనా నియమావళికి అడుగడుగునా తూట్లు పొడిచేలా ప్రవర్తించిన ద్వివేది, గిరిజాశంకర్‌ తమ పదవుల్లో కొనసాగితే మరిన్ని దుష్పరిణామాలు తప్పవని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. 
 
ఎన్నికల నిర్వహణలో వారి ఆధ్వర్యంలో నడిచే పంచాయతీరాజ్‌ శాఖ కీలక పాత్ర పోషించాల్సి ఉన్నందున వారు అవే పదవుల్లో కొనసాగితే పలు ప్రతిబంధకాలు ఎదురవుతాయన్నారు. అందువల్ల వీరిద్దరి బదిలీకి, అభిశంసనకు ఆదేశాలిస్తున్నట్లు తెలిపారు. ఈ అభిశంసనను వారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని కమిషనర్‌ స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు గవర్నర్‌ను కలవనున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ