వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పీక్కు చేరిందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. జగన్ పబ్లిసిటీ పిచ్చి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ పొదిలి పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్దుడు జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
దీనిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారన్నారు. ఆదరణ ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. జగన్ మాదిరి ఎవరూ ప్రచారం కోరుకోరు అని దుయ్యబట్టారు.
'బలం ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలు కూడా లెక్కచేయరా? బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లారు. అక్కడికి వెళ్లి మరో ఇద్దరి ప్రాణాలను జగన్ తీశారు. కారు ఢీకొనగానే సింగయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవారు. జగన్ కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే.. పక్కకు ఈడ్చేసి వెళ్లిపోయారు. ప్రమాదంలో వృద్ధుడు చనిపోయినా ఆయన కనీసం పశ్చాత్తాప పడలేదు' అని గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.