Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల కొండపై శిలువ పెట్టామా? ఏడు కొండలన్ని 2 కొండలు చేశామా?

తిరుమల కొండపై శిలువ పెట్టామా? ఏడు కొండలన్ని 2 కొండలు చేశామా?
, బుధవారం, 20 జనవరి 2021 (18:35 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో కూర్చుని రోజూ జూమ్ కాన్ఫరెన్సులు పెట్టి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా మీడియాలో చూస్తే..  శ్రీకాకుళం జిల్లాలో సంత బొమ్మాళిలో ఒక గుడిలో ఉన్న నందీశ్వరుడ్ని కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి, రోడ్డు మీద ఉన్న దిమ్మ మీద పెట్టేందుకు ప్రయత్నించడం, అది సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వటం చూశాం. మరి, దీని గురించి చంద్రబాబు నాయుడు, మిగతా ప్రతి పక్షాలు ఎందుకు మాట్లాడటం లేదు.? ఇందులో తెలుగుదేశం పాత్ర స్పష్టంగా కనిపించేసరికి మీ నోళ్ళు పెగలటం లేదా..?
 
ప్రభుత్వం ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తున్న ప్రతిసారీ.. ఇటువంటి కుట్రలకు తెలుగుదేశం, చంద్రబాబు పథకాలు రచిస్తున్నారు. ఈ విషయం గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో రేషన్ బియ్యం డెలివరీ వాహనాలను ప్రారంభిస్తున్న సందర్భంలో, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు తెలుగుదేశం ఇటువంటి కుట్రలకు ప్లాన్ వేసింది. 
 
దేవాలయాల దాడులు, విగ్రహ రాజకీయాల్లో సంతబొమ్మాళి ఘటనతో చంద్రబాబు, టీడీపీ బండారం బయటపడ్డాక.. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులలో ఎవరు సమాధానం చెబుతారు..? వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు..? రామతీర్థం పై అంతగా హడావుడి చేసిన చంద్రబాబు, బీజేపీ నాయకులు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఎందుకు బయటకు రావటం లేదు. ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు..?
 
బైబిల్ చేతపట్టుకున్న మహిళ భర్తకు టీటీడీ ఛైర్మెన్ పదవి ఇచ్చామని అన్యాయంగా మాట్లాడటానికి చంద్రబాబుకు అసలు సిగ్గు ఉందా..? అతను అసలు మనిషేనా..? తిరుమల కొండపై శిలువ పెట్టామా.. అన్యమత ప్రచారం చేస్తున్నామా.. ఏడు కొండల్ని రెండు కొండలు చేశామా.. ఇంత అన్యాయమైన మాటలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి అబద్ధాలను, అసత్యాలను చంద్రబాబు ఈ వయసులో మాట్లాడి మరింత పాపం మూట కట్టుకుంటున్నాడు. 
 
గతంలో గుజరాత్‌లో అల్లర్లు జరిగిన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ మీద అవసరం లేకపోయినా, ఉద్దేశపూర్వకంగా, మతాన్ని రెచ్చగొట్టే విధంగా, పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో, చంద్రబాబు మీద మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు కేసులు పెట్టేందుకు కూడా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ సెక్షన్ల వివరాలు చూస్తే.. 153-ఏ , 498, 500 కింద చంద్రబాబు మీద కేసులు పెట్టారు. ఈరోజు కూడా చంద్రబాబు మీద అటువంటి కేసులే పెట్టాలి. 
 
ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నోటి నుంచి ఏరోజైనా.. నేను హిందువుని, నేను క్రిస్టియన్‌ని, నేను ముస్లింని అన్న మాటలు వచ్చాయా..? ఎవరైనా, ఎప్పుడైనా ఇలా మాట్లాడారా..? చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతగా దిగజారిపోయాడు. రాజకీయాలను ఎందుకు ఇంతగా విషపూరితం చేస్తున్నాడు. ఏం సాధించాలని..?
 
చంద్రబాబు ముందున్న లక్ష్యం ఏమిటంటే.. లోకేష్‌ను ఏదోరకంగా, అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేయాలి. ఇందుకోసం ఎన్ని కుట్రలైనా చేయాలి, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి. అందుకే దేవాలయాలు, మతంతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అనిపిస్తోంది. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయటం అసలు సాధ్యపడుతుందా..? లోకేష్‌కు ఆ అర్హత ఉందా..?‌
 
రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఢిల్లీ వెళితే.. లోకేష్ ఇష్టారాజ్యంగా ట్వీట్లు పెట్టాడు. అసలు సీఎం జగన్ మీద ట్వీట్లు పెట్టే స్థాయా లోకేష్‌ది...? పనీపాటా లేని లోకేష్‌కు.. అంతగా ట్వీట్లు పెట్టుకోవాలనిపిస్తే.. ఏ సినిమాల మీదో, లేక పబ్జీ గేమ్‌ల మీదనో పెట్టుకో. అంతేగాని స్థాయిని మరచి విమర్శలు చేయవద్దు అని హితవు చెబుతున్నాం. 
 
శిశుపాలుని వధ ఈరాష్ట్రంలో జరగాలని నిన్న చంద్రబాబు అంటున్నాడు. శిశు పాలుడు ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు మిగిలి ఉన్నది శిశు బాలుడు. అంటే ఎవరో కాదు.. అతను లోకేష్. హెరిటేజ్ పాలు తాగకుండా లోకేష్ రోజు మొదలవదు. ఈసారి లోకేష్‍‌కు హెరిటేజ్ పాలకు బదులు... ఏపీలోని అమూల్ పాలు తాగిస్తేనైనా, అతని బుద్ధి ఏమైనా మారుతుందేమో చూడాలి. 
 
ఈ రాష్ట్రంలో జరగాల్సింది జరాసంధుడి వధ. ఆరకంగా చంద్రబాబును 1983లోనే ప్రజలు ఒకసారి ఓడించారు. జరాసంధుడు ఎన్నిసార్లు ఓడిపోయినా.. అతని శరీరం తిరిగి అతుక్కున్నట్టు చంద్రబాబు నాయుడు అతుక్కుంటుంటే..  2004, 2009 ఎన్నికల్లో వైయస్ఆర్ వధించారు. మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల్లో జగన్ గారు ఇక ఎప్పటికీ గెలవకుండా పాతాళానికి  తొక్కేశారు. 
 
సంతబొమ్మాళి కుట్రకు పూర్తిగా టీడీపీదే బాధ్యత. ఇటువంటి కుట్రలు చేయకుండా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రంలో విగ్రహ రాజకీయాలు చేయకుండా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని, శ్రీరాముడ్ని, నందీశ్వరుడ్ని వేడుకుంటున్నాం. పీఠాధిపతులు, మఠాధిపతులు, పత్రికాధిపతులు, ఛానళ్ల వారు కూడా సంతబొమ్మాళిలో నందిని ఎత్తుకుపోయి, రోడ్డులోని ఒక కూడలిలో పెట్టిన టీడీపీ దొంగల గురించి మాట్లాడాలి అంటూ మంత్రి అప్పల్రాజు మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్స్‌ సర్వీస్‌మెన్ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించండి..