Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తవాలు దాచిపెట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం : మంత్రి అనిల్‌కుమార్‌

వాస్తవాలు దాచిపెట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం : మంత్రి అనిల్‌కుమార్‌
, గురువారం, 11 మార్చి 2021 (09:26 IST)
‘ఈనాడు పత్రికలో ఒక వార్త రాశారు. డయాఫ్రమ్‌ వాల్‌ గోదావరి వరదార్పణం అని. అయితే అందుకు వాస్తవ కారణాలన్నీ దాచిపెట్టి, అక్కడ పనులు సరిగ్గా జరగడం లేదన్న అపోహ ప్రజల్లో సృష్టించడం కోసం రాసినట్లుంది. ఎందుకంటే అది కట్టింది ఆయన సొంత బంధువులు. దాన్ని ఎప్పుడు కట్టారు. అది ఎందుకు కొట్టుకుపోయింది అని రాసి ఉంటే బాగుండేది. ఆ డయాఫ్రమ్‌ వాల్‌ను 2018లో చంద్రబాబు నాయుడుగారి హయాంలో కట్టారు. ఇవాళ అది కొట్టుకుపోవడానికి కారణాలు మేము చాలా సార్లు చెప్పాం అని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
ప్లాన్‌ లేకుండా పనులు:
‘ప్రాజెక్టును ఒక ప్లాన్‌ ప్రకారం కాకుండా, ఇష్టానుసారం ముక్కలు ముక్కలుగా కట్టారు. నిజానికి స్పిల్‌ ఛానల్, స్పిల్‌ వే పూర్తి చేసి నీటిని మళ్లించిన తర్వాత కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసుకుని, ఆ తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ కట్టి ఉంటే, ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఈ విషయాన్ని చాలా సార్లు కూడా చెప్పాము. గత ప్రభుత్వం స్పిల్‌ ఛానల్, స్పిల్‌ వే హాఫ్, కాఫర్‌ డ్యామ్‌ హాఫ్, మళ్లీ మధ్యలో డయాఫ్రమ్‌ వాల్‌.. ఇలా ఒక్కటి కూడా పూర్తి చేయకుండా, అన్నీ అసంపూర్ణంగా చేశారు’.
 
అందుకే కూలిపోయింది:
‘లక్షలాది క్యూసెక్కుల నీరు వస్తుందని తెలిసినా, అలా ఇష్టానుసారం అసంపూర్తిగా పనులు చేయడం వల్ల, ఇవాళ 1.5 కి.మీ పొడవైన డయాఫ్రమ్‌ వాల్‌ వద్ద ఇసుకు కొట్టుకు రావడంతో 185 మీటర్ల మేర ఆ వాల్‌ కూలిపోయింది. ఈ వాస్తవాలు రామోజీరావు రాసి ఉంటే బాగుండేది. కానీ అవేవీ లేకుండా ఒక వార్త వరదార్పణం అని రాయడం నిజంగా బాధాకరం’.
 
పీపీఏకు కూడా వివరించాం:
‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మొట్టమొదటి సమీక్షా సమావేశంలోనే చెప్పారు. స్పిల్‌వే పనులు పూర్తి చేయకుండా అన్నీ సగం సగం కట్టడం వల్ల నష్టం జరుగుతుందని. ఈ విషయాలను ఇప్పటికే ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి వివరించడం కూడా జరిగింది’.
 
ప్రణాళిక ప్రకారం పూర్తి:
‘వచ్చే మే నెల నాటికి స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేసుకుని, ఆ తర్వాత కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేసి, వరదనీటితో ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకం రాకుండా వాటిని పూర్తి చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవాలు రాయకుండా ఇప్పుడు జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లుగా రామోజీరావు గారు రాయడం బాధకరం’.  ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలో, ఆ ప్రణాళిక ప్రకారం పనులు చేస్తాం. సీఎం గారు ఎప్పటికప్పుడు దీన్ని రివ్యూ చేస్తున్నారు’.. అని వివరించిన మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆ తర్వాత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని ప్రస్తావించారు.
 
నాడు వ్యతిరేకించారు.. ఇవాళ ప్రేమ ఒలకపోస్తున్నారు!:
‘విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కడతామంటే ఆనాడు పూర్తిగా వ్యతిరేకించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, చంద్రబాబు ఇవాళ ఆ నగరంపై ఎంతో ప్రేమ ఒలకపోస్తున్నారు. కేవలం 29 గ్రామాలలో వాళ్ల సామాజికవర్గమో లేక వారి బినామీల ప్రయోజనం కోసం అమరావతిలో రాజధాని అని కట్టారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడతామంటే పూర్తిగా వ్యతిరేకించిన వారు, ఇవాళ విశాఖపట్నం మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను జగన్‌గారే అమ్మేస్తున్నట్లు నానా రకాలుగా అబద్ధాలతో ఇవాళ మాట్లాడుతున్నారు’. 
 
సీఎం గారు స్పష్టంగా చెప్పారు:
‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం ప్రతిపాదన రాగానే సీఎం శ్రీ వైయస్‌ జగన్, కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆ తర్వాత నిన్న కూడ మరో లేఖ రాశారు’. ‘మాకు అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వండి. అఖిలపక్ష బృందం, కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువచ్చి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి రాష్ట్రానికి ఉన్న సెంటిమెంట్, ఆ సంస్థను లాభాలబాటలోకి ఎలా మళ్లించవచ్చన్నది స్వయంగా చెబుతామని సీఎం గారు ప్రధానికి లేఖ రాస్తే.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాగూ గెలవరు కాబట్టి, ఏదో ఒక అలజడి సృష్టించి, ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం ఇవాళ జరుగుతోంది’.
 
చిల్లర రాజకీయాలు:
‘రామోజీరావు తన షేర్లు, ఆస్తులు అన్నీ అమ్ముకోవచ్చు. అలాగే పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయిస్తే, అందుకు రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యత ఎలా అవుతుంది? అయినప్పటికీ దాన్ని ఏ విధంగా ఆపాలి. అక్కడి కార్మికులు, భూనిర్వాసితుల ప్రయోజనాలు ఎలా కాపాడాలి అని ఆలోచించిన సీఎం గారు, అన్ని విషయాలతో స్పష్టంగా ప్రధానికి లేఖ రాశారు. ఆ విధంగా అన్ని విషయాలు స్పష్టంగా చెప్పినా, ఇవాళ చిల్లర రాజకీయాలు చేయడం చూస్తున్నాం’.
 
ఏ ముఖం పెట్టుకుని?:
‘ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు ఇటీవల గాజువాకలో మాట్లాడాడో అర్ధం కావడం లేదు. 1999 నుంచి 2004 వరకు దేశవ్యాప్తంగా 104 కంపెనీలను మూసేయడమో లేక అమ్మేయడమో చేస్తే, నాడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 54 సంస్థలను క్లోజ్‌ చేయడమో లేక అమ్మేయడమో జరిగింది. ఆరోజు ఇదే ఈనాడు పేపర్‌ ఏం రాసింది? నష్టాల్లో ఉన్న వాటిని మూసేయకుండా ప్రోత్సహిస్తారా? అని రాసింది. నాడు చంద్రబాబునాయుడు ఒక పుస్తకం కూడా రాశారు. తాను రాష్ట్రానికి ఒక సీఈఓ అని చెప్పుకున్నారు. ప్రైవేటీకరణకు ఆద్యుడిగా నిల్చిన చంద్రబాబు, ఇవాళ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడుతున్నాడు’.
 
తమ సామాజికవర్గంపైనే మమకారం:
‘చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ నిజానికి మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. ప్రజలు బాగు పడుతుంటే, వారి తలరాతలు మారుతుంటే చూసి ఏడ్చేవారు, చూసి తట్టుకోలేని వారు, ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్చుకోలేని నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు. రాష్ట్రం ఎటు పోయినా, ప్రజలకు ఏం జరిగినా మాకు సంబంధం లేదు. కేవలం మా సామాజికవర్గం బాగుండాలి అని పాకులాడే వ్యక్తులు.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ. కనీసం వార్త రాసేటప్పుడు వివరణ కూడా లేదు. ఇదొక పేపర్‌. థూ వారి బ్రతుకులు చెడ’ అంటూ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ శైలి నచ్చింది... లగపాటి రాజగోపాల్