Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన గవర్నర్

ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన గవర్నర్
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (23:13 IST)
రాష్ట్రంలో నూతన రాజ్ భవన్ ఏర్పాటు సమయంలో తొలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా ఎంతో శ్రమించి మంచి పనితీరుతో అనతి కాలంలోనే రాజ్ భవన్ ప్రాంగణానికి సర్వహంగులు సమకూర్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా, గవర్నర్ ఎడిసి ఎస్ వి మాధవరెడ్డి విజిలెన్స్ విభాగంలో అదనపు ఎస్పిగా బదిలీ అయిన నేపధ్యంలో గౌరవ గవర్నర్ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.
 
శుక్రవారం రాజ్ భవన్ దర్బార్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ముఖేష్ కమార్ మీనా, మాధవ్ రెడ్డిలను గవర్నర్ శ్రీ హరిచందన్ మెమెంటో, శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ముఖేష్ కుమార్ మీనా విశ్వసనీయమైన, సమర్ధవంతమైన అధికారి అని, రాజ్ భవన్ వ్యవస్ధను తీర్చిదిద్దటంలో మంచి పనితీరును చూపారని, రోజువారీ కార్యాలయ వ్యవహారాలలో సైతం ఎప్పుడు ఎలాంటి అసౌకర్యం తనకు కలగలేదని అన్నారు.
 
నూతన శాఖ విషయంలోనూ మీనాపై ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన భాధ్యతలను ఉంచిందని, అక్కడ కూడా విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం తనకుందని హరిచందన్ అన్నారు. అదే క్రమంలో వ్యక్తిగత భద్రత, అధికారిక కార్యక్రమాలతో సహా విభిన్న అంశాలను  మాధవ రెడ్డి చాలా జాగ్రత్తగా నిర్వహించారని గవర్నర్ ప్రస్తుతించారు. మీనా, మాధవ రెడ్డిలు రాజ్ భవన్ ను వీడుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పగించిన అతి ముఖ్యమైన పనుల నిర్వహణకు వెళుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందిని తన కుటుంబ సభ్యులుగానే తాను భావిస్తానని, వారిలో ఎవరికి ఆపద ఎదురైనా తగిన స్పందన కనబరచాలని తాను ఉన్నతాధికారులను సూచిస్తూ ఉంటానని గవర్నర్ అన్నారు.
 
ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ గవర్నర్‌తో కలిసి పనిచేయడం గౌరవప్రదమని,  నిరంతరం తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించినందుకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. కొత్త గవర్నర్ పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి రాజ్ భవన్ ప్రాంగణాన్ని సిద్ధం చేయడం, దానిని సమర్థవంతంగా పనిచేయించటానికి ఎంతో శ్రమ పడినప్పటికీ అందరి సహకారంతో అన్నిహంగులు కలిగిన వ్యవస్ధగా రూపుదిద్దగలిగామన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్‌లో అమలు అవుతున్న ఇ-అపాయింట్‌మెంట్,  ఇ-కన్వొకేషన్,  ఇ-మెసేజ్‌ తరహా ఐటి కార్యక్రమాలు అఖిల భారత స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయని తన ప్రతి అడుగు లోనూ మాననీయ గవర్నర్ ఎంతో ప్రోత్సహిస్తూ వచ్చారని మీనా వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, గవర్నర్ వారి వ్యక్తిగత కార్యదర్శి బెహరా, ఎడిసి సహిల్ మహాజన్ తదితరులు ముఖేష్ కుమార్ మీనా ఎంచదగిన పనితీరును ప్రదర్శిస్తూ మానవీయ కోణం కలిగిన అధికారిగా వ్యవహరించారన్నారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విధ్వంస సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోంది: మోడీ