Publish Date: Wed, 26 Aug 2020 (06:29 IST)
Updated Date: Wed, 26 Aug 2020 (06:31 IST)
ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు కొండుభట్ల రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంకు సమర్పించారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు రామచంద్రమూర్తి వెల్లడించారు.
రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్ట్. ఆయన పలు పత్రికలకు ప్రధాన సంపాదకులుగా పని చేశారు. రామచంద్రమూర్తితో పాటు ప్రభుత్వంలో ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించారు. వీరిలో పది మందికి కేబినెట్ హోదా కూడా ఉంది.
ఆ రాజీనామా వెనుక...?
పేరుకు డజన్ల మంది సలహాదారులున్నప్పటికీ, వారిలో ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లేవారిలో అజయ్కల్లం రెడ్డి- సజ్జల రామకృష్ణారెడ్డి-జీవీడీ కృష్ణమోహన్- రామచంద్రమూర్తి వంటి తక్కువమంది వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు.
ఆయన సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. పైగా.. ఆయన పేరుకు ప్రభుత్వ సలహాదారుడైనప్పటికీ, కార్యాలయానికి స్టేషనరీ కూడా ఇచ్చే దిక్కులేదు. అన్నీ కొనుగోలు చేసుకోవడమే. జీఏడీ కూడా.. మంత్రుల కార్యాలయ వ్యవహారాలు తప్ప, సలహాదారులకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత కాదని చేతులెత్తేసింది.
ఏపీలో సలహాదారులందరి పరిస్థితి ఇదే. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి చాంబరు కోసం మాత్రమే… అజయ్కల్లం స్వయంగా చాంబరు చూసి, అక్కడున్న సెక్రటరీని ఖాళీ చేయించారు. దానితో, ఇక పనిలేకుండా సర్కారు జీతం తీసుకోవడం మంచిదికాదన్న భావనతో.. రెండు నెలల క్రితమే, తన రాజీనామా లేఖను సజ్జలకు ఇచ్చారు.
అయితే, తొందరపడవద్దని, తాను మాట్లాడతానని చెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు రాజీనామా ఇచ్చినట్లు తెలుస్తోంది.