Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్ చెర నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల..నేడు స్వరాష్ట్రానికి రాక

పాక్ చెర నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల..నేడు స్వరాష్ట్రానికి రాక
, మంగళవారం, 7 జనవరి 2020 (06:04 IST)
రాష్ట్రంలో మత్య్యకారులకు పది రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది.. పాక్‌ చెరలో చిక్కుకున్న 20 మంది మత్స్యకారుల కోసం 14 నెలలుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న యావత్‌ మత్స్యకారులందరి కళ్లలో ఈరోజు కొత్త కాంతి కనిపిస్తోంది..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ప్రత్యేక చొరవతో.. పాకిస్తాన్‌ బంధించిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. మంత్రి  మోపిదేవి స్వయంగా వాఘా సరిహద్దుకు వెళ్లి వారిని స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకు రావడం మత్స్యకారుల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, చిత్తశుద్ధికి అద్దం పట్టింది.

సోమవారం భారత–పాక్‌ సరిహద్దు వద్ద పాక్‌ అధికారులు వారి చెరలో ఉన్న మత్స్యకారులను అధికారులతో కూడిన మంత్రి మోపిదేవి బృందానికి అప్పగించారు. గుజరాత్‌ తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వీరంతా పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

మత్స్యకారులు తాము బందీలుగా ఉన్న మాలిర్‌ జిల్లా జైలు నుంచి ఆదివారం సాయంత్రం విడుదలయ్యారు. వారిని పాకిస్తాన్‌ అధికారులు కరాచీ నుంచి లాహోర్‌ వరకు రైలులో తీసుకొచ్చారు. అనంతరం సోమవారం రాత్రి 7 గంటలకు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతాదళానికి అప్పగించారు.

జాలర్లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లేందుకు వచ్చిన మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి స్వాగతం పలికి స్వీట్లు తినిపించారు. ఈ 20 మందిని మంగళవారం ఉదయం ఢిల్లీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారు మీడియాతో మాట్లాడాక సాయంత్రం విమానంలో విశాఖపట్నం పంపనున్నారు. 
 
జాలర్లు వీరే: ఎస్‌.కిశోర్, ఎన్‌.ధన్‌రాజ్, గురుమూర్తి, రాంబాబు, ఎస్‌.అప్పారావు, జి.రామారావు, బి.అప్పన్న, ఎం.గురువులు, ఎన్‌.అప్పన్న, ఎన్‌.నర్సింగ్, వి.శామ్యూల్, కె.ఎర్రయ్య, డి.సూర్యనారాయణ, కె.మణి, కె.వెంకటేశ్, ఎస్‌.కల్యాణ్, కె.రాజు, బి.బవిరుడు, సన్యాసిరావు, సుమంత్‌.
 
మత్స్యకారులకు అండగా ఉంటాం: మంత్రి మోపిదేవి
మత్స్యకార కుటుంబాలు ప్రజాసంకల్ప యాత్రలో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పాకిస్తాన్‌లో బందీలుగా ఉన్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలని విన్నవించారని మంత్రి మోపిదేవి చెప్పారు. ఆయన ఆదేశాలతో అప్పటి నుంచే తమ పార్టీ ప్రత్యేక చొరవ చూపి విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపిందన్నారు.

ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ.. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరపడంతో మత్స్యకారులు విడుదలయ్యారని వెల్లడించారు. ఇది వారికి పునర్జన్మ అని, ఇప్పటికైనా విడుదల కావడం సంతోషకరమన్నారు. మత్స్యకారులంతా సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉన్నామని చెప్పారన్నారు.

వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరో ఇద్దరు మత్స్యకారులు డాక్యుమెంట్లు, తదితర సాంకేతిక కారణాలతో విడుదల కాలేదని, వారిని కూడా విడుదల చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడి పందేలకు అనుమతి లేదు