Publish Date: Tue, 25 Jan 2022 (11:59 IST)
Updated Date: Tue, 25 Jan 2022 (12:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు చేయూతనిచ్చేలా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించనుంది. 45 యేళ్ల నుంచి 60 యేళ్లలోపు వారికి ఈ పథకం వర్తింపజేస్తారు. మొత్తం 3,92,674 మంది పేద మహిళలకు 589 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు.
మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కో ఈబీసీ మహిళకు రూ.15 వేలు చొప్పున మూడేళ్ళలో 45 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు.
ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులోభాగంగా, ఇపుడు కొత్తగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది.