Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తిన వెళుతున్న సీఎం చంద్రబాబు.. 4న ప్రధాని మోడీతో భేటీ!

Advertiesment
babu cbn

వరుణ్

, బుధవారం, 3 జులై 2024 (09:38 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో విభజన హామీలతో  సహా పలు అంశాల పరిష్కారం కోసం కేంద్రంతో సహకారం కోరనున్నారు. అలాగే, వచ్చే బడ్జెట్‌లో రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7.25 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాలతో ఆయన భేటీ అయ్యే సూచనలు ఉన్నాయి. కాగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత హస్తినకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు సంబంధింత శాఖల మంత్రులను చంద్రబాబు కలిసి విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రధానికి సీఎం బాబు ప్రత్యేకంగా ఒక నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే, త్వరలో కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్టు తెలుస్తుంది. కాగా, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి, మరికొందరు నేతలు కూడా చంద్రబాబుతో కలిసి వెళ్లనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హథ్రాస్ తొక్కిసలాటలో 122 మందికి చేరుకున్న మృతుల సంఖ్య!!