Publish Date: Wed, 13 May 2026 (15:01 IST)
Updated Date: Wed, 13 May 2026 (15:34 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతినేకాకుండా ఐటీ నగరంగా గుర్తింపు పొందుతున్న విశాఖపట్టణంను కూడా విశ్వనగరంగా చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన బుధవారం రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆస్పత్రి వైద్య విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నాం. ఆ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఏరోస్పేస్ హబ్గా అనంతపురం మారబోతోంది. రాయలసీమ 'టెక్నాలజీ హబ్'గా తయారవుతోంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయి. శ్రీసిటీ.. ఇండస్ట్రియల్ హబ్గా తయారైంది.
ఇపుడు భాస్కర్రావు ఒక విజన్ ఇచ్చారు. 2027 మే 13న కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తాం. 2028 ఆగస్టు 15 కంటే ముందే విశాఖలో గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. 2028 డిసెంబరులోపు ఫేజ్-1 పూర్తి చేయాలని ఆర్సెల్లార్ మిట్టల్కు ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అనుమతులు కావాలన్నా త్వరగా ఇస్తాం. లక్ష మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తాం. వైద్యులు కూడా ఏఐని నేర్చుకుంటున్నారు. లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. ప్రపంచంలో ప్రతి ముగ్గురు వైద్యుల్లో ఒకరు ఇక్కడి నుంచే ఉండాలి. డిసెంబరు నాటికి భారత్లో క్వాంటం కంప్యూటింగ్కు చిరునామాగా అమరావతి అవుతుంది.
విదేశాలపై ఆధారపడకుండా గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రతి పొలంలో, ఇంటిపైనా సోలార్ రూఫ్టాప్ లాంటి విద్యుదుత్పత్తి కేంద్రాలు తీసుకొస్తాం. పశ్చిమాసియా యుద్ధం వల్ల పెట్రోల్, గ్యాస్, డీజిల్ కొరత వచ్చింది. భవిష్యత్తులో వర్క్ఫ్రమ్ హోం వస్తుంది.. ప్రభుత్వంలో కూడా తీసుకొస్తాం. 10 కార్లతో కాన్వాయ్గా రావడం ఫ్యాషనైంది.. సెక్యూరిటీ అర్ధవంతంగా ఉండాలి.
హాలిడే వస్తే విదేశాలకు వెళ్తున్నారు. మంచి పర్యాటక ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయి. అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రదేశాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. గోవాను మించిన టూరిజం కేంద్రంగా సూర్యలంక మారుతుంది' అని సీఎం అన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.